– ప్రేమ పేరుతో మోసం…
సిద్దిపేట, ప్రజాతంత్ర జనవరి 5: ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. చివరికి కులం పేరుతో పెళ్లికి నిరాకరించాడు. దీంతో మోసపోయానని భావించిన ఓ యువ వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో నిందితుడైన డాక్టర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం జోగులాంబ గద్వాల జిల్లా మానోపాడు మండలం, జల్లాపురం గ్రామానికి చెందిన బి. లావణ్య (23) సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో హౌస్ సర్జన్గా పనిచేస్తోంది. పేద దళిత కుటుంబానికి చెందిన లావణ్య, ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలలో చదివి, గచ్చిబౌలి గౌలిదొడ్డి క్యాంపస్లో ఇంటర్ పూర్తి చేసింది. 2020లో మొదటి ప్రయత్నంలోనే సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్లో చేరింది.అదే కళాశాలలో సీనియర్ రెసిడెంట్గా జనరల్ మెడిసిన్ చదువుతున్న సికింద్రాబాద్ ఆల్వాలకు చెందిన ప్రణయ్ తేజ్ తో గత సంవత్సరం జూలైలో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వివాహం చేసుకుంటానని నమ్మించిన ప్రణయ్ తేజ్అ నంతరం కుల కారణంగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన లావణ్య ఈనెల 3న మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో గడ్డి నివారణకు ఉపయోగించే మందును ఇంజక్షన్ చేసుకుంది. అపస్మారక స్థితిలో ఉన్న లావణ్యను రూమ్మేట్లు గమనించి సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ 4 వ తేదీ తెల్లవారుజామున మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి అక్క శిరీష ఫిర్యాదు మేరకు సిద్దిపేట త్రీ టౌన్ సి ఐ విద్యాసాగర్ కేసు నమోదు చేశారు. నిందితుడైన ప్రణయ్ తేజ్ను అదుపులోకి తీసుకొని విచారణ ప్రారంభించారు.
నిందితుడిపై BNS సెక్షన్లు 108, 69తోపాటు ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
———————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





