– మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష
– కేసీఆర్ కుటుంబంపై చర్యలు లేకపోవడానికి ఇదే కారణం
– కరీంనగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్
– కుటుంబీకులు, జర్నలిస్టులతో కలిసి రాఖీ సంబరాలు
కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 9: రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. మీ పదేళ్ల అవినీతికి మేం రక్ష.. మా దోపిడీకి మీరు రక్ష అనేలా కాంగ్రెస్, బీఆర్ఎస్లు అవినీతి, దోపిడీలలో ఒకదానికొకటి రక్షగా నిలుస్తూ ప్రజలను వంచిస్తున్నాయి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని కరీంనగర్లోని తన నివాసంలో కుటుంబీకులు, పార్టీ కార్యకర్తలు, జర్నలిస్టులతో కలిసి బండి సంజయ్ రాఖీ సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని తేలినా కేసీఆర్ కుటుంబంపై కాంగ్రెస్ చర్యలు తీసుకోకపోవడానికి ఆ రెండు పార్టీల మధ్యనున్న ‘రక్షా’ బంధమే కారణమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్ లీగల్ నోటీసులిస్తానంటున్నారని, వాటికి తాను భయపడే ప్రసక్తే లేదని అన్నారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకే చేసిన తప్పులు, పాపాల నుండి తప్పించుకునేందుకు లీగల్ నోటీసుల పేరుతో భయపెట్టాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే విషయంపై ఏ గుడికైనా కుటుంబ సభ్యులతో కలిసి వస్తా.. దేవుడి సాక్షిగా ప్రమాణం చేస్తా.. నువ్వు కూడా నీ భార్యాపిల్లలు, తల్లిదండ్రులతో కలిసి గుడికి వచ్చి ఫోన్ ట్యాపింగ్ జరగలేదని వాళ్లందరితో కలిసి ప్రమాణం చేస్తావా అని కేటీఆర్కు సవాల్ విసిరారు. నేను ఏం తప్పు చేప్పిన.. సాక్షాత్తు మీ చెల్లెలు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పారు.. ఆమెకు లీగల్ నోటీసులిస్తారా అని ప్రశ్నించారు. నోటీసులిస్తే ఏం చేయాలో నాకు తెలుసు. అంతకంటే నోటీసులు ఎక్కువ నా దగ్గరున్నాయి అని అన్నారు. దేశం కోసం, ధర్మ రక్షణ కోసం రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేసి జైలుకు పోయి వచ్చినోడినని బండి అన్నారు.ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ జరిపించాలనే విషయంలో మాకు స్పష్టత ఉంది. ఎందుకంటే సిట్ పరిమితి చాలా తక్కువ. మావోయిస్టుల పేరు చెప్పి రాజకీయ ప్రముఖుల, సినీ తారల, వ్యాపారుల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసి బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లకు పాల్పడినందున ఆ లావాదేవీలకు సంబంధించి పూర్తిస్థాయి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఈడీ విచారణ చేస్తేనే సాధ్యమవుతుంది అని సంజయ్ చెప్పారు. టెలికం రెగ్యులేటరీ అథారిటీ నిబంధనలను ఉల్లంఘించి కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించింది. ఇది పూర్తిగా కేంద్ర పరిధిలోని అంశమన్నారు.
ఆ అధికారం సిట్కు ఉందా?
జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్లు సిట్ పోలీసులు ఆధారాలతో వెల్లడిరచినందున వారికి పిలిచి స్టేట్మెంట్ రికార్డు చేసే అధికారం సిట్కు ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ సహా పలువురు మంత్రుల ఫోన్లను కూడా గత ప్రభుత్వం ట్యాప్ చేసింది. ఆ ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయి. ఫోన్ ట్యాప్ నిందితులిచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లోనూ ఈ వివరాలు వెల్లడిరచారు. అలాంటప్పుడు సీఎంకు నోటీసులిచ్చి విచారణకు రమ్మని ఆదేశించే సాహసం సిట్ చేయగలుగుతుందా అని అన్నారు. పెద్దాయన(కేసీఆర్) చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రధాన నిందితుడు రాధాకిషన్ రావు, నాటి డీజీపీ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రభాకర్ రావు చెప్పారు. అయినా ఇంతవరకు వాళ్లకు నోటీసులిచ్చి పిలిచే సాహసం కూడా సిట్ చేయలేకపోతోందన్నారు.. సిట్ అధికారులపై మీకు నమ్మకం లేదా అని అడిగిన ప్రశ్నకు సంజయ్ బదులిస్తూ సిట్ అధికారులపై నమ్మకం ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వంపై లేదు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్లు, ఫార్ములా ఈ రేసు సహా అనేక కేసుల్లో విచారణ పేరుతో జాప్యం చేస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు. అందుకే సీబీఐ విచారణ అడుగుతున్నామని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయటకు రావాలి
ర్ఎస్ ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం, రోషం ఉంటే ఆ పార్టీని వదిలి బయటకు రావాలని హితవు చెప్పారు. ఎందుకంటే ఆనాడు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారు.. అయినా మీరు ఇంకా ఎట్లా బీఆర్ఎస్లో ఉంటున్నారో అర్ధం కావడం లేదని అన్నారు.





