– హౌసింగ్ బోర్డుకు భారీ ఆదాయం
– రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల ద్వారా రూ.26 కోట్లు
హైదరాబాద్ , ప్రజాతంత్ర, జూలై 30 : కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్బీ) కాలనీలోని ఓపెన్ ఫ్లాట్లకు మరోసారి రికార్డు స్థాయి ధర పలికింది. పూర్తి పారదర్శక విధానంలో ఈ-ఆక్షన్ ప్రక్రియ ద్వారా హౌసింగ్ బోర్డు భూములను బుధవారం విక్రయించింది. కేపీహెచ్బీ 4 ఫేజ్ లోని ఫ్లాట్ నెం 1 కు చెందిన ఎకరం విస్తీర్ణంలోని కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ ను రూ.65.34 కోట్లకు కొనుగోలు చేశారు. ఆన్ లైన్ ద్వారా వేలం పాట నిర్వహించినందున బిడ్డర్ల వివరాలు చివరి నిమిషం వరకు ఎవరికీ తెలియకుండా ఉండటంతోపాటు, బిడ్డర్లు స్వేచ్ఛగా ధరను కోట్ చేసే అవకాశం లభించడంతో ఎకరం ధర రికార్డు స్థాయికి చేరింది. ఈ స్థలానికి సంబంధించిన వేలం పాటకు మొత్తం 11 బిడ్లు దాఖలు కాగా నలుగురు బిడ్డర్లు వేలంలో పాల్గొన్నారని హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వి.పి.గౌతం తెలిపారు. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టర్ అక్కౌంటెన్సీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ భూమిని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.
రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల ద్వారా 26 కోట్లు
బండ్లగూడ నాగోల్ లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను దరఖాస్తు దారులకు లాటరీ ద్వారా కేటాయించడం ద్వారా ప్రభుత్వానికి 26 కోట్ల మేర ఆదాయం సమకూరింది. కేవలం మధ్యతరగతి వర్గాల ప్రజల కు మేలు చేకూరేలా అందుబాటులోని ధరలతో ఈ ఫ్లాట్లను తక్కువ ధరలతో విక్రయించారు. ఇక్కడి 159 ఫ్లాట్లకు దరఖాస్తులు ఆహ్వానించగా, మొత్తం 131 ఫ్లాట్లను లాటరీ ద్వారా కేటాయించడం ద్వారా 26 కోట్ల మేర ఆదాయం వచ్చింది.





