- మంత్రి కొండా సురేఖ
- రూ.5.87 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్టు 21: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తున్నదని రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అన్నారు. గురువారం తూర్పు నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రూ 5.87కోట్ల వ్యయంతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అందులో జిడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో 15వ ఆర్థిక సంఘ, జనరల్ ఫండ్ నిధులు, ఎస్ ఎఫ్ సి పథకాల క్రింద రూ. 4.87కోట్లవ్యయంతో బల్దియా పరిధి 32 వ డివిజన్ బి ఆర్ నగర్ లో బస్తి దవాఖాన, ఎన్ ఎన్ నగర్ లో సిసి రోడ్లు, జ్యోతినగర్ లో సిసి రోడ్లు, అంబెడ్కర్ భవన్ కమ్యూనిటీ హాల్, బీరన్నకుంట కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు, 28వ డివిజన్ బట్టలబజార్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కిచెన్ షెడ్ 42 డివిజన్ రంగశాయిపేట లో నిర్మించనున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ పనులకు, ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో కోటి రూపాయల వ్యయంతో మాషుఖ్ రబ్బానీ దర్గా లో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. బిరన్నకుంట ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మంత్రి, మేయర్, కలెక్టర్, కమిషనర్ మధ్యాహ్నం భోజనం వడ్డించారు. కరిమాబాద్ పరపతి సంఘ భవనంలో లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను మంత్రి కొండా సురేఖ మేయర్, కలెక్టర్, కమిషనర్ లతో కలసి అందచేశారు.
అనంతరం కరీమాబాద్ లోని ఫంక్షన్ హాల్ లో, రంగశాయిపేట కమ్యూనిటీ హాల్ లో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి ఆహార భద్రత కల్పించాలనే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నామని అన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ ప్రజలు గత పది సంవత్సరాల నుండి ఎదురు చూశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల సమస్యల మీద దృష్టి సారిస్తున్నారని, అందుకే రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం రేషన్ ద్వారా దొడ్డు బియ్యం ఇచ్చిందని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాక పేద ప్రజలకు రేషన్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. నూతన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని అన్నారు. రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని రేషన్ కార్డు మంజూరైన వారికి వెంట వెంటనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గ సంపూర్ణ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నట్లు, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి వివరించారు. సంక్షేమ వసతి గృహాల్లో 40% మిస్ చార్జీలతోపాటు 200 శాతం కాస్మెటిక్ చార్జీలు పెంచామని అన్నారు. పూర్తి నాణ్యతతో కూడిన పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రామకృష్ణ మిషన్ అక్షయపాత్ర వారి ద్వారా జిల్లాలోని 123 ప్రభుత్వ పాఠశాలలో మొదటి విడతలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పిస్తున్నట్లు, అందులో భాగంగా ఈరోజు కరీమాబాద్ లోని బీరన్నకుంటతో పాటు 55 ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారన్నారు. దశలవారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో అమలు చేస్తామన్నారు.
ముంపు ప్రమాదం నుంచి పరిరక్షిస్తాం..
వరంగల్ మహా నగరాన్ని హైదరాబాద్ మాదిరిగా సమగ్ర అభివృద్ధి చేసేందుకు మామునూరు విమానాశ్రయం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, ఏర్పాటుకు ముందుకెళ్తున్నామని మంత్రి (Konda Surekha )తెలిపారు. వరంగల్ నగరాన్ని ముంపు నుండి నివారణకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్నట్లు, ప్రజా ప్రతినిధులు అధికారులు సహకరించాలని మంత్రి కోరారు. దేవదాయ శాఖ మంత్రిగా ఉన్న తాను ప్రణాళిక బద్ధంగా జిల్లాలోని అన్ని దేవాలయాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు.
నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ దశాబ్ద కాలం నుండి వేచి చూస్తున్న రేషన్ కార్డుల ఎలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారా సాకారం అయిందన్నారు. ప్రతి రేషన్ కార్డుకు సన్నం బియ్యం ఇచ్చే ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కు దక్కుతుందన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు అర్హత కల లబ్ధిదారులకు 6815 నూతన రేషన్ కార్డులు, మంజూరు చేసి, 26766 కుటుంబ సభ్యుల పేర్లను రేషన్ కార్డులు నమోదు చేశారన్నారు. తూర్పు నియోజకవర్గంలో 2690 కొత్త రేషన్ కార్డులను, రేషన్ కార్డులలో 7592 కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేయడం జరిగిందని, మీసేవ, ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న పరిశీలన పూర్తయిందని అర్హత గల వారికి అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ చాహాత్ బాజ్ పాయి, కార్పొరేటర్లు, బల్దియా ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.





