దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచండి

శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని ఎలా గుర్తించారు?
లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ఆధారాలు ఉన్నాయా?
వివరాలు తెలియకుండా సీఎం ఎలా ప్రకటిస్తారు..
ప్రస్తుత పరిస్థితుల్లో సిట్‌ ‌దర్యాప్తుపై అనుమానాలు
‘సుప్రీమ్‌’ ‌ సంచలన వ్యాఖ్యలు

న్యూదిల్లీ, సెప్టెంబర్ 30: ‌తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం వివాదంపై సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని హితవు పలికింది. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారనడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్‌ ‌రోహత్గీని జస్టిస్‌ ‌బి ఆర్‌ ‌గవాయ్‌, ‌జస్టిస్‌ ‌కేవీ వి బాలకృష్ణన్‌ ‌ధర్మాసనం ప్రశ్నించింది. కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్టు ‌నిలదీసింది.

ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ‌నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటించ‌డంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్‌ ‌సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. స్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించినట్లు ఎలా తెలిసిందంటూ సుప్రీంకోర్ట్ ‌సందేహం వ్యక్తం చేసింది. అలాగే లడ్డూని పరీక్షల కోసం ల్యాబ్‌కి ఎప్పుడు పంపారని ముకుల్‌ ‌రోహాత్గిని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపితే బావుంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది.

అనంతరం ఈ కేసు విచారణను జస్టిస్‌ ‌బీఆర్‌ ‌గవాయ్‌, ‌జస్టిస్‌ ‌కేవీ బాలకృష్ణన్‌ ‌ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు తిరుమల లడ్డూ వివాదంపై జస్టిస్‌ ‌బీఆర్‌ ‌గవాయ్‌, ‌జస్టిస్‌ ‌కేవీ విశ్వనాథన్‌ ‌ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఆరోపణలు నేపథ్యంలో ఈ అంశంలో నిగ్గు  తేల్చాలంటూ బీజేపీ సీనియర్‌ ‌నేత సుబ్రహ్మణ్య స్వామి, వైసీపీ సీనియర్‌ ‌నేత వైవీ సుబ్బారెడ్డి వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. వీటిపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిపింది.

గ‌త ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర అపచారం జరిగిన నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో శాంతి హోమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించింది. అలాగే సంప్రోక్షణ సైతం చేపట్టింది. అందులోభాగంగా ఆనంద నిలయంతో పాటు తిరుమల మాఢవీధుల్లో సైతం సంప్రోక్షణ నిర్వహించింది. మరోవైపు తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరపాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. గుంటూరు ఐజీ సర్వ శ్రేష్టి త్రిపాఠి నేతృత్వంలో సిట్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో శనివారం సిట్‌ ‌బృందం తిరుమల చేరుకుని.. తన దర్యాప్తును ప్రారంభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *