– అందుకే బీఆర్ఎస్ మూడోసారి మట్టి కరిచింది
– ప్రతిపక్షం అన్నింటా ఫెయిల్
– ఇప్పుడా బాధ్యతను జాగృతి పోషిస్తుంది
– ఖమ్మంలో మీడియాతో కవిత సంచలన వ్యాఖ్యలు
ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 18: రాష్ట్రంలో అధికార పక్షం, ప్రతిపక్షం బాధ్యతగా వ్యవహరించటంలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నేత తుమ్మల నాగేశ్వరరావును బీఆర్ఎస్ వొదులుకోవడంతోనే మూడోసారి అధికారంలోకి రాకుండా పోయిందంటూ వ్యాఖ్యలు చేశారు. తుమ్మల లాంటి నేతను బీఆర్ఎస్ వొదులుకోవడం నూటికి నూరు శాతం పెద్ద తప్పే అని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఫెయిల్ అయ్యిందని, తన బాధ్యతను నిర్వర్తించలేకపోతోందని విమర్శించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను భవిష్యత్తులో తాము పోషించబోతున్నామన్నారు. కొత్త పార్టీ గురించి కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్పై విరుచుకుపడ్డారు. తనను ఏ విధంగా పార్టీ నుంచి బయటకు పంపారనే విషయాన్ని తెలియజేశారు. రాజకీయ పార్టీ గురించి ఇప్పుడప్పుడే ఆలోచన చేయటం లేదని అన్నారు. కుట్రతో బీఆర్ఎస్ నుంచి తనను బయటికి పంపించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది కుట్ర చేసి తనను, తన కుటుంబాన్ని బీఆర్ఎస్కి దూరం చేశారన్నారు. తన జీవితంలో చిన్న పొరపాటు కూడా చేయలేదన్నారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు తనకు ఎక్కడా ఎటువంటి అవకాశం ఇవ్వలేదని, కనీసం ఒక టీచర్ పోస్ట్ కూడా ట్రాన్స్ఫర్ చేయించుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్లో జాగృతి కార్యకర్తలకు అన్యాయం చేశారని, కనీస గుర్తింపు ఇవ్వలేదని కవిత ఆరోపించారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరులుదిన జిల్లా ఖమ్మం జిల్లా అని జాగృతి అధ్యక్షురాలు అన్నారు. జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లా పూర్తిగా మారిపోయిందని గుర్తుచేశారు. వెంగళరావు హయాంలో జిల్లా విశేషంగా అభివృద్ధి చెందిందన్నారు. ఆ తరువాత పెద్దలు తుమ్మల నాగేశ్వరావు ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిపారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. ఖమ్మం అభివృద్ధి కోసం ఎవరి ప్రయత్నం వారు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు. సీతారామ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక తెలంగాణ రావాలన్నదే తన ఆశయమని, అవకాశం, అధికారం, ఆత్మగౌరవం కోసమే తన పోరాటమని కవిత స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి విప్లవాత్మకమైన మార్పులు రావాలని, అన్ని వర్గాలకు అధికారం అందాలని ఆకాంక్షించారు. బీసీలకు భిక్షం వేయొద్దని.. బిక్షం వేస్తే తీసుకోవడానికి వాళ్ళు బిచ్చగాళ్ళు కాదని అన్నారు. బీసీల పేరుతో కాంగ్రెస్ దిల్లీలో దొంగ దీక్షలు చేసిందని విమర్శించారు. రేవంత్ రెడ్డి బీసీల ద్రోహిగా మిగిలిపోతారని., నూరు శాతం బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. జమలాపురం టెంపుల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జమలాపురం ఆలయంపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. పాతర్లపాడులో సామినేని రామారావు దారుణ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. దీనిపై డీజీపీని కలువనున్నట్లు కవిత తెలిపారు. హత్యా రాజకీయాలు సరికాదన్నారు. హైదరాబాద్లో సింగరేణి కార్మికుల సమస్యలపై సింగరేణి భవన్ను బుధవారం ముట్టడించబోతున్నామని ప్రకటించారు. సీతారామ ద్వారా భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాద్ జిల్లాలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి ఆయకట్టు స్థిరీకరించి రైతాంగానికి సాగు నీరు అందించాలన్నారు. ఉద్యమకారులకు 250 గజాల భూమి వొచ్చే వరకు వారి తరఫున పోరాడతామని స్పష్టం చేవారు. పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, సీసీఐతో మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





