– అందరినీ కలుపుకుని సామాజిక తెలంగాణ కోసం పోరు
– జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 9: కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తామని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కాళోజీ జయంతి సందర్భంగా జాగృతి కార్యాలయంలో కాళోజీ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగానూ అంజలి ఘటించారు. అనంతరం కవిత మాట్లాడుతూ.. ఉన్నతమైన ఆశయాలతో అడుగు వేయాలని ఆలోచిస్తున్నాం. ఉన్నతమైన లక్ష్యం దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయి. సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి కార్యకర్తలు విశ్రమించబోరని అన్నారు. సామాజిక తెలంగాణ సాధన కోసం అందరినీ కలుపుకొని ముందుకు సాగుతాం. కేసీఆర్ అజెండాను తెలంగాణ జాగృతి తరఫున ముందుకు తీసుకెళ్తాం. కాళోజీ స్ఫూర్తితోనే అందరమూ పని చేశాం.. పని చేస్తాం. ఐలమ్మ స్ఫూర్తితో అందరూ విజృంభించి అన్యాయాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు.. మంగళవారం నాడు ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతిని పురస్కరించుకొని జాగృతి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళోజీ చిత్రపటానికి కవిత నివాళులర్పించారు. ఇదే సమయంలో వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కవిత పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ జాగృతి కృషి చేస్తుందన్నారు. ఉన్నతమైన లక్ష్యంతో ముందుకు వొస్తామని, సామాజిక తెలంగాణ సాధించేవరకు జాగృతి కృషి చేస్తుందని చెప్పారు. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. తెలంగాణ సాధనలో బొంత పురుగునైనా ముద్దాడుతానన్న కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు పోతామని కవిత చెప్పుకొచ్చారు. లెప్ట్ టు రైట్ అందర్నీ కులుపుకుని ముందుకు వెళతామన్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి వొచ్చుంటే సామాజిక తెలంగాణ కోసం కృషి చేసేవారని కవిత పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని రాజకీయంగా ముందుకు వెళతామని స్పష్టం చేశారామె. ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుపైనా కీలక కామెంట్స్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మల్లన్నసాగర్ నుంచే హైదరాబాద్కు తాగునీటి కోసం సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారన్నారు. రూ. 1500 కోట్ల ప్రాజెక్టును రూ. 7,500 కోట్లకు పెంచారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సొమ్మును మెగా కృష్ణా రెడ్డికి దోచి పెడుతున్నారంటూ కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. కుంభకోణంలో భాగంగానే ప్రాజెక్టు అంచనాలు పెంచారని ఆరోపించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





