– ఆదేశించిన మద్రాసు హైకోర్టు
చెన్నై, అక్టోబర్ 3: తమిళనాడులోని కరూర్లో గత నెల 27న జరిగిన తొక్కిసలాటలో 41మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుకు మద్రాసు హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. ప్రామాణిక కార్యాచరణ విధానాలు రూపొందించే వరకూ రాష్ట్ర, జాతీయ రహదారుల వెంబడి రాజకీయ పార్టీల ర్యాలీలపై తాత్కాలిక నిషేధం విధించింది. విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ బీజేపీ నేత ఉమా ఆనందన్ వేసిన పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. మధురై హైకోర్టు బెంచ్ను ఆశ్రయించాలని సూచించింది. టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పును జస్టిస్ సెంథిల్ కుమార్ రిజర్వ్ చేశారు.
ఐజీ అస్రా గార్గ్ నేతృత్వంలో ‘సిట్’
తమిళనాడు నార్త్ జోన్ ఐజీ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశాలిచ్చింది. నమక్కల్ ఎస్పీ కూడా ఇందులో ఉంటారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని రికార్డులను తక్షణం సిట్కు అప్పగించాలని ఆదేశించింది. నేపాల్లో జరిగిన తరహాలో రివల్యూషన్ను తమ పార్టీ తీసుకురానున్నట్టు పేర్కొంటూ టీవీకే నేత ఆధవ్ అర్జున్ చేసిన ట్వీట్పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. కాగా, తన ట్వీట్ను ఆధవ్ అర్జున్ ఆ తర్వాత తొలగించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


