– ప్రభుత్వ చర్యలకు సుప్రీం కోర్టు అభినందన
న్యూదిల్లీ, ఆగస్ట్ 13: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం సుప్రీంకోర్టులో మరోమారు విచారణ జరిగింది. కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ పునరుద్దరణ చర్యలు చేపడుతున్నామని కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సమగ్ర ప్రణాళికను సమర్పించేందుకు ఆరు వారాలు గడువు ప్రభుత్వం కోరింది. ఇందుకు అనుమతిస్తూ సీజేఐ జస్టిస్ బీ.ఆర్ గవాయి ధర్మాసనంతదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది . అభివృద్దికి తాము అడ్డుకాదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. సుస్ధిర అభివృద్ధి ముఖ్యమని సీజేఐ ధర్మాసనం పేర్కొంది. అభివృద్ధి చేసేటప్పుడు పర్యావరణ పరిరక్షణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ సూచించారు. కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణ చర్యలు మంచి ఫలితాలు ఇస్తే తప్పకుండా మెచ్చుకుంటామని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఉపసంహరించుకొని మరింతగా ప్రశంసిస్తామని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొనడం గమనార్హం.





