– ఐదుగురు బాలల పరార్పై మంత్రి సీతక్క సీరియస్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: సైదాబాద్ జువెనైల్ హోం నుంచి ఐదుగురు బాలలు మంగళవారం రాత్రి తప్పించుకుపోయిన ఘటన పట్ల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క సీరియస్ అయ్యారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇద్దరు సూపర్వైజర్లపై వేటు పడగా సూపరింటెండెంట్కు మెమో జారీ చేశారు. జువెనైల్ హోంలో బాలలు తప్పించుకుపోకుండా అదనపు సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. జువెనైల్ హోం నుంచి బాలలు తప్పించుకుపోయిన సంఘటనపై జువెనైల్ వెల్ఫేÛర్ శాఖ అధికారులు సచివాలయంలో మంత్రి సీతక్కకు నివేదిక సమర్పించారు. సంఘటన వివరాలను డిప్యూటీ డైరెక్టర్ చార్వాక్, అసిస్టెంట్ చీఫ్ ప్రొబేషన్ సూపర్వైజర్ నవీన్లు మంత్రికి వివరించారు. తప్పించుకుపోయిన ఐదుగురు బాలల్లో ముగ్గురు ఆచూకీ లభించిందని, మిగిలిన ఇద్దరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసుల సహాయం తీసుకుంటున్నామని అధికారులు వెల్లడిరచారు.





