•బార్ అసోసియేషన్ ఘనంగా వీడ్కోలు
•తదుపరి ఎలాంటి పదవులు చేపట్టను : ఖన్నా
•నేడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా గవాయ్ ప్రమాణం
•రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించనున్న ముర్ము
న్యూదిల్లీ,మే13: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవీకాలం మంగళవారం తో ముగిసింది. సుప్రీంకోర్టులో చివరి రోజు బెంచ్ కార్యలాపాలు ముగిసిన తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ ఖన్నా మాట్లాడారు. తదుపరి ఎటువంటి అధికారిక పదవులను చేపట్టనని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలోనే ఏదైనా చేయాలనుకుం టున్నానని చెప్పారు. మరోవైపు జస్టిస్ ఖన్నా పదవీ విరమణ నేపథ్యంలో సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేసింది. భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా గతేడాది నవంబర్ 11 బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాకు దివంగత మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా సమీప బంధువు. 2005లో దిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులైన జస్టిస్ ఖన్నా.. ఆ మరుసటి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా ఉన్నతి పొందారు.
2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, నవంబర్ 11న సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. ఖన్నా పదవీవిరమణతో భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ మే 14న బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన సీజేఐతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా, భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆరు నెలలు మాత్రమే సేవలందించారు. కాగా తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ పేరును సీజేఐ ఖన్నా ఏప్రిల్ 16న కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2019 మే 24న సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వొచ్చిన జస్టిస్ గవాయ్ సీజేఐగా ఆరు నెలలకుపైగా కొనసాగి 2025 నవంబర్ 23న పదవీ విరమణ చేస్తారు. జస్టిస్ కేజీ బాలకృష్ణన్ తర్వాత సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న రెండో దళిత న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ కావడం విశేషం. గవాయ్ పూర్తిపేరు భూషణ్ రామ కృష్ణ గవాయ్. 1960 నవంబర్ 24న మహారాష్ట్రలోని అమరావతిలో జన్మించిన జస్టిస్ గవాయ్.. 1985 మార్చి 16న బార్లో సభ్యుడిగా చేరారు. 2003 నవంబర్ 14న బాంబే హైకోర్టు అదనపు న్యాయ మూర్తిగా పదోన్నతి పొందారు. 2005 నవంబర్ 12న అదే హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియ మితులయ్యారు.





