ఆర్జేడీ గత పాలనపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
పాట్నా,అక్టోబర్24: బీహార్లో ఆర్జేడీ ‘జంగల్ రాజ్’పై మరో వందేళ్లయినా చర్చ జరుగుతూనే ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు తమ దురాగతాలను దాచిపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ప్రజలు క్షమించరన్నారు. ప్రతిపక్షాలది ‘మహాగఠ్బంధన్’ కాదని..’లఠ్బంధన్ అంటే నేరస్థుల కూటమి అని విమర్శించారు. ఆ పార్టీల నేతలంతా బెయిల్పై బయట తిరుగుతున్నవారేనని పేర్కొన్నారు. ’మేరా బూత్ సబ్సే మజ్బూత్: యువ సంవాద్’ ఆడియో కాన్ఫరెన్స్లో ప్రధాని మోదీ ఈ మేరకు ప్రసంగించారు. బీహార్లో ఆర్జేడీ పాలనలో సాగిన అకృత్యాలపై నేటి తరం యువకులకు అవగాహన కల్పించేలా బీజేపీ శ్రేణులు చొరవ తీసుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలో ఎన్డీయే సర్కారు నేతృత్వంలో అభివృద్ధి మహాయజ్ఞం జరుగుతోందన్నారు. బీహార్ సైతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. కేంద్రం, రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండటం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. అందుకే స్థానిక యువత సైతం ‘వేగంగా దూసుకెళ్తోంది బీహార్.. మరోసారి ఎన్డీయే సర్కార్’ అని నినదిస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నేతలకు తమలో తాము ఎలా పోట్లాడుకోవాలో, స్వప్రయోజనాలను ఎలా కాపాడుకోవాలో మాత్రమే తెలుసు. బీహార్ను ఆటవిక రాజ్యం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు, శాంతిభద్రతలను నెలకొల్పేందుకు సీఎం నీతీశ్కుమార్, ఎన్డీయే నేతలు ఎంతో కృషి చేశారు. స్థానికంగా మావోయిస్టులను నిర్మూలించే దిశగా ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో టెక్నాలజీ, స్టార్టప్ హబ్లను సృష్టించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తాయి. యువత కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


