రేపు ‘జూబ్లీ’ ఉప ఎన్నిక ఫలితాలు

– సర్వత్రా ఉత్కంఠ
– కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ల మ‌ధ్యే పోటీ
– బీజేపీ పోటీ నామామాత్రమేనా ?
(మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి)
 హోరాహోరీగా జరిగిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోరాటంలో తుది విజయం ఎవరిదన్నది శుక్ర‌వారం తేలనుంది. శుక్రవారం ఉదయం ఎనిమిది గంటనుండే అదృష్టం ఎవరిని వరించనుందన్నది వెల్లడికానుంది. ఈ ఎన్నికల్లో 58 మంది పోటిపడినప్పటికీ ప్రధానంగా మూడు పార్టీల మ‌ధ్య‌నే పోరు కొనసాగింది. అందులోనూ కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ మధ్య‌ నువ్వానేనా అన్నట్లుగా యుద్దవాతావర్ణాన్ని తలపించేవిదంగా పోటీ కొనసాగింది. ఈ రెండు పార్టీలుకూడా తమ శక్తి, యుక్తులన్నీ ఈ ఎన్నికల్లో ప్రయోగించిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం వెల్లడికానున్న ఫలితాల్లో ఎవరు విజయం సాధిస్తారన్నది మాత్రం యావత్‌ తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠాన్ని లేపుతున్నది. ఇది కేవలం తెలంగాణ ప్రజల్లోనేకాదు. దేశంలోని వివిధ రాజకీయ పార్టీలుకూడా ఈ ఫలితాలపై ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఎందుకంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ఏకధాటిగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన బిఆర్‌ఎస్‌ పార్టీ, పదేండ్లు అధికారంలో కొనసాగిన పరిపాలనకు, కాంగ్రెస్‌ రెండేళ్ళ పాలనకు జరుగుతున్న పోటీగా దీన్ని భావిస్తున్నారు. ప్రజలు ఎవరిపాలనవైపు మొగ్గు చూపుతారన్నది ఒకటికాగా, అభివృద్ధి, సానుభూతి అనే రెండింటిలో  ప్రజలు దేనికి పట్టంకడుతారన్నది కూడా ఆసక్తిని కలిగిస్తున్న అంశం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభివృద్ధి నినాదాన్ని ఎత్తుకుంది. కంటోన్మెంట్‌ నియోజకవర్గం మాదిరిగా జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంకూడా అన్నివిధాలుగా అభివృద్ధి చెందాలంటే తమ పార్టీ అభ్యర్థికే వోటు వేయాలంటూ కాంగ్రెస్‌ ప్రచారం చేసింది. తాము అధికారంలో ఉండటంవల్ల అభివృద్ధికోసం నిధుల సమీకరణ సులభతరం అవుతుందని ప్రజలకు అర్థమయ్యేరీతిలో కాంగ్రెస్‌ చెప్పేప్రయత్నంచేసింది. కాగా, రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన సిట్టింగ్‌ స్థానం తమ ఖాతాలోనే ఉం టుందన్న ధీమాను వ్యక్తంచేస్తున్నది. ఈ స్థానంలో గెలిచిన బీఆర్‌ఎస్‌ నేత దివంగత మాగంటి గోపీనాథ్‌ కుటుంబంపై ఉన్న సానుభూతి తమ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపిస్తుందన్న నమ్మకం ఆ పార్టీలో బలంగా ఉంది. అంతేగాక గత రెండేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలోఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక పోవడంతో ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత తమ అభ్యర్థి గెలుపుకు దోహదపడుతుందని బీఆర్‌ఎస్‌ బలంగా నమ్ముతున్నది. అయితే, తమ అభ్యర్థిపైన ప్రజల్లో ఉన్న సానుభూతికి భయపడి, ఓటమి భయంతో కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో అనేక అక్రమాలకు పాల్పడిరదంటూ పార్టీనేతలు ఆరోపిస్తున్నారు. దొంగ వోట్లు అనేకం పోలైనాయని, కొన్నిచోట్ల వోటర్లను భయబ్రాంతులకు గురిచేశారని, తమ అభ్యర్థినే పోలింగ్‌ స్టేషన్‌లోకి అనుమతించకుండా పోలీసులు నిరోధించారని, అధికారులు, పోలీసుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదంటూ బీఆర్‌ఎస్‌ నేతలు చేస్తున్న ఆరోపణలను కాంగ్రెస్‌ కొట్టిపారేస్తున్నది. ఆరునూరైనా గెలుపు తమదేనంటూ ఆ పార్టీనేతలు ప్రకటిస్తున్నారు. తమ అభ్యర్థి గెలుపు ఎప్పుడో తేలిపోయిందని, అయితే మెజార్టీకోసం ఎదురుచూస్తున్నామంటున్నారు కాంగ్రెస్‌ నాయకులు.  మొత్తానికి ఈ ఫలితాలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు జీవన్మరణ సమస్యగా మారాయి. గత ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్‌ఎస్‌ మనుగడ ఈ ఎన్నికల ఫలితాలతో ముడివడిఉండగా,  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండేళ్ళ పాలనకు ఇదొక దిక్సూచి అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలాఉంటే రాజకీయ వర్గాల్లోనూ, రాష్ట్ర ప్రజల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న ఈ ఫలితాల కోసం బెట్టింగ్‌లు కొనసాగుతున్నాయి.
ఇదిలాఉంటే పలు సంస్థలిచ్చిన ఎగ్జిట్‌పోల్‌ నివేదికలు ఆసక్తిని కలిగించేవిగా ఉన్నాయి. ఈ సర్వే సంస్థలు ఎక్కువ శాతం కాంగ్రెస్‌కే పట్టం కడుతున్నాయి. దాదాపు ఎనిమిది నుండి పది సంస్థలు చేసిన సర్వేల్లో 42 మొదలు 48.5 శాతం వోట్లు కాంగ్రెస్‌కు సంక్రమిస్తాయని ఉంది. రెండవస్థానంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఉంటుందని చెబుతున్నాయి. బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి 41 నుంచి 43.18 శాతం వరకు వోట్లు వొచ్చే అవకాశముందని ఆ సంస్థలు తమ ఎగ్జిట్‌పోల్‌ సర్వేల్లో వెల్లడిరచాయి. కాగా మిషన్‌ చాణక్య, కోడ్‌మో`కనెక్టింగ్‌ డెమక్రసీ సర్వే సంస్థలు మాత్రం 42.1 నుంచి 41.60 శాతం వోట్లతో బీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమని చెబుతున్నాయి.  పై సంస్థలన్నీ బీజేపిని మూడవ స్థానంలోనే కూర్చోబెట్టాయి. బీజేపికి 5.84 నుంచి 8 శాతంకు మించి వోట్లు రావన్న లెక్కలు వేశాయి. మొత్తానికి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లో ఏ పార్టీ గెలిచినా 5 నుంచి పది శాతం ఆధిక్యతనే సాధించుకుంటాయని ఆ లెక్కలు చెబుతున్నాయి.
ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్‌ బ్యాలెట్‌లో ప్రారంభమయ్యే వోట్ల లెక్కింపు, నియోజవర్గంలోని ఏడు డివిజన్‌లకు సంబంధించి పది రౌండ్ల లెక్కింపుతో పూర్తి అవుతుంది. ఎప్పటిలాగానే సిటీ వోటర్లు తమ వోటు హక్కును వినియోగించుకోవడంలో బద్దకస్తులన్న విషయం ఈ ఎన్నికలో మరోసారి రుజువైంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది వోటర్లుండగా కేవలం లక్షా 94,631 మంది (48.49) మాత్రమే తమ వోటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 99,771 కాగా మహిళలు 94,855 మంది ఉన్నారు.
———————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page