- పన్నుల భారం మోపినోళ్లకు ఓటేద్దామా..
– కాంగ్రెస్ను ఓడిస్తేనే బతుకుల బాగుపడతాయి
– మున్సిపల్ ప్రచారంలో నిలదీసిన ఎమ్మెల్యే హరీష్ రావు
సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జిన్నారంను మున్సిపాలిటీ చేసి పన్నుల భారం మోపిందని, ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు ఓటర్లను ప్రశ్నించారు. మనల్ని మంచిగా చూసుకున్న వాళ్ళకు, మన భారాన్ని తగ్గించే వాళ్ళకే ఓటేద్దామన్నారు. పటాన్చెరువు నియోజకవర్గం జిన్నారం మున్సిపాలిటీలో శుక్రవారం పర్యటించి జిన్నారం గ్రామం వాకిటి వద్ద స్థానికులతో ముచ్చటించిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్న తీరును ఎండగట్టారు. తాము అధికారంలో ఉన్నప్పుడు జిన్నారం గ్రామ పంచాయతీగానే ఉండాలని కోరుకున్నామని, మున్సిపాలిటీ అయితే ప్రజల మీద పన్నుల భారం పడుతుందని ఆపామని చెప్పారు. కేసీఆర్ రూ.200 ఉన్న పెన్షన్ను రూ.2000 చేస్తానని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే నెరవేర్చారని చెప్పారు. రేవంత్ రెడ్డి రూ.4000 ఇస్తానని చెప్పి రెండేళ్లు గడిచినా ఇవ్వడం లేదని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2500 ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశాడని హరీష్రావు విమర్శించారు. ఈ 24 నెలల్లో ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.60,000 చొప్పున బాకీ పడిందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మకు ప్రతి మహిళకు చీర ఇచ్చేదని, రేవంత్ రెడ్డి వచ్చాక చీర లేదు, గాజులు లేవని చెప్పారు. ఏదో గ్రూపులో ఉన్న కొద్దిమందికి ఇచ్చి చేతులు దులుపుకున్నాడన్నారు. ఫ్రీ బస్సు అని చెప్పి మగవాళ్లకు టికెట్ రేట్ డబుల్ చేశాడని తెలిపారు. రేవంత్ రెడ్డి వచ్చాక ఐదు పంటలు వస్తే రెండింటికి ఇచ్చి మూడింటికి రైతుబంధు ఎగ్గొట్టాడని విమర్శించారు. నాటేసిన వాళ్లకే రైతుబంధు ఇస్తా, శాటిలైట్లో చూసి ఇస్తా అని కొత్త నిబంధనలు పెట్టి రైతులను గోస పెడుతున్నాడని హరీష్రావు మండిపడ్డారు. దేవుడి మీద ఒట్టు వేసి రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన పాపాత్ముడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు గుద్దితే రేవంత్ రెడ్డికి గూబ గుయ్యిమనాలె అని పిలుపునిచ్చారు. అప్పుడే హామీలు అమలు చేస్తాడన్నారు. మహిళలకు రావాల్సిన రూ.60,000, అవ్వ తాతలకు రూ.4000 పెన్షన్ రావాలంటే బీఆర్ఎస్ గెలవాలని అన్నారు. ప్రశ్నిస్తే కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రెండేళ్లు ఓపిక పట్టాలని, వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమేనని, జిన్నారం సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు.
పటాన్చెరులో పలువురు బీఆర్ఎస్లో చేరిక
మున్సిపల్ ఎన్నికల వేళ పటాన్చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ ఎంపీపీలు దేవానందం, యాదగిరి యాదవ్, వెంకట్ రెడ్డి, దశరథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, అన్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, అన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్ లతోపాటు 500మంది కార్యకర్తలు హరీశ్ రావు నాయకత్వంలో బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కండువా కప్పి ఆయన సాదర స్వాగతం పలికారు. నియోజకవర్గ పరిధిలోని ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.