– నాలుగు పేజీల లేఖ విడుదల
– పదేళ్లుగా అవమానాలు భరించాక కూడా పట్టించుకోరా..
– కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న భావనే లేదు
– ఇక రేవంత్ రెడ్డిపైనే నా పోరాటం
జగిత్యాల, ప్రజాతంత్ర, మార్చి 25: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికే మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సిద్దంగా లేరు. ఈ క్రమంలో రాజీనామాపై మరోసారి స్పందించారు. రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ విధానాలకు విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్న సంతోషం లేకుండా చేశారని మండిపడ్డారు. 20 నెలలుగా పార్టీలో మానసిక వేదనకు గురైనట్లు తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నాలుగు పేజీల రాజీనామా లేఖను కార్యకర్తల సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేవంత్రెడ్డి మీద పోరాటం చేస్తానంటూ శపథం చేశారు. తనను నమ్ముకున్న అనుచరులకి పదవులు రాకపోతే పార్టీలో కొనసాగడం అవసరమా అని ప్రశ్నించారు. ప్రభుత్వ న్యాయవాదుల నియామకంలోనూ తాను న్యాయవాదిని అయినా పట్టించు కోలేదన్నారు. గత పదేళ్లలో కాంగ్రెస్ కార్యకర్తలని హింసించి కొట్టించినవారిని గద్దేనెక్కిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం మాది అన్న ఫీలింగ్ మావారికి లేదని.. గాంధీభవన్లో ఫిరాయింపుల ఎమ్మెల్యే ఉంటే సమావేశంలో ఎలా పాల్గొంటారన్నారు. రాహుల్ గాంధీ ఫాంచ్ న్యాయ్ అని రాజ్యంగం పట్టుకొని తిరుగుతే ఇక్కడ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నారన్నారు. ఈ వయస్సులో నేను పార్టీ మారి ఎం చేస్తాను. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో తలదూర్చితే నేను ఎలా భరిస్తాను. నేను ఇరవై మాసాలు ఓపిక పట్టాను. కాంగ్రెస్ పార్టీలో నన్ను అడుక్కునే స్థాయికి పట్టుకొచ్చారు. మీనాక్షి నటరాజన్ ఎనభై శాతం సీట్లు నాకే ఇస్తామని మాట ఇచ్చారు.. ఆ మాట పట్టించుకోలేదు. నాకు టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎలా చెబుతాడు. పదవులు కావాలనుకుంటే నేను బీఆర్ఎస్లోకి వెళ్లేవాడిని. పీసీసీ అధ్యక్షుడు కావాల్సినోడిని నా హక్కుల కొసం పోరాటం చేసే పరిస్థితి వచ్చింది. జీవన్ రెడ్డి అణగదొక్కాలన్నదే ఆలోచన. చంద్రబాబు, కేసీఆర్ల మీద పోరాటం చేశాను.. ఇప్పుడు రేవంత్రెడ్డి మీద పోరాటం చేస్తాను. అడుగులకి మడగులు ఒత్తేటోళ్ళే కు కావాలా? రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా నడిచే వాణ్ని అణగదొక్కారు. బతకవచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం సలహాదారుడా? పోచారం ఇప్పటివరకు ఏం సలహాలు ఇచ్చాడని సీనియర్ నేత జీవన్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో రాహుల్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర నాయకత్వం ప్రవర్తిస్తోందని జీవన్ రెడ్డి మండిపడ్డారు. హైకమాండ్ తీరు, పార్టీలోకి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను తీసుకున్న కారణంగానే మనస్తాపంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ కష్టార్జితమని.. పదేళ్లు తమను ఇబ్బంది పెట్టిన వారిని తీసుకువచ్చి పార్టీలో చేర్చుకుంటారా? అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్ నిర్ణయాలు జాతీయస్థాయిలో ప్రభావితం చూపబోతున్నాయని.. ’జై భీమ్-జై సంవిధాన్-జై బాపు’ నినాదాలకు తూట్లు పొడిచారంటూ విమర్శించారు. కాంగ్రెస్ను వీడటం బాధగా ఉన్నా తప్పడం లేదంటూ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





