– సామరస్య వాతావరణం ముఖ్యం
– పక్షపాతం లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలి
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21: బాన్సువాడలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన తమ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసిన ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. శాంతియుత నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, అలాంటి హక్కును అరెస్టుల ద్వారా అణచివేయడం అత్యంత విచారకరమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు అన్నారు. ఒక దుకాణంలో దేవి దుర్గమ్మకు సంబంధించిన భక్తి గీతం వినిపించడంపై అక్కడ పనిచేస్తున్న ఒక ఇతర మత ఉద్యోగి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రారంభమైన ఈ సంఘటన తరువాత హిందువులపై ముస్లిం సమూహం రాళ్లు రువ్వినట్లు వచ్చిన నివేదికలు తమకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఈ ఘటన స్థానిక ప్రజల్లో భయాందోళనలు సృష్టించిందంటూ సమాజంలో సామరస్య వాతావరణం, పరస్పర గౌరవం అత్యంత ముఖ్యమైనవి అని బీజేపీ నమ్ముతోందన్నారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం సమర్థనీయం కాదన్నారు. అదే సమయంలో పోలీసులు, పాలనా యంత్రాంగం అన్ని వర్గాల పౌరులకు రక్షణ కల్పిస్తూ ఎలాంటి పక్షపాతం లేకుండా వ్యవహరించాల్సింది పోయి శాంతియుతంగా తమ ఆందోళన చేస్తున్న బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు వ్యవహరించడం తగదన్నారు. హింసకు, అల్లర్లకు కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవడంపైనే దృష్టి పెట్టాలి కానీ ఎంపిక చేసి హిందూ సమాజ వ్యక్తులపై చర్యలు. ఇతర వర్గాలను వదిలి పెట్టే చర్యలు, ముస్లిం వర్గాలపై సానుకూలత ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని, ప్రజాస్వామ్య విలువలను బలహీనపరుస్తాయని తెలిపారు. తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేసి, న్యాయంగా, పారదర్శకంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తున్నామని రామచందర్రావు అన్నారు. కాగా, కామారెడ్డిలో కాటిపల్లి వెంకట రమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చకు స్థానం ఉండాలి గానీ, హింసకు కాదని అన్నారు. కాంగ్రెస్ నాయకుల రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అల్లర్లకు పాల్పడటం అత్యంత దుర్మార్గమన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కామారెడ్డిలో ప్రజల ప్రశాంతతకు భంగం కలిగిస్తే బీజేపీ సహించదన్నారు. తమ కార్యకర్తలకు అండగా నిలిచేందుకు, పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి నిజాలు ప్రజల ముందు ఉంచేందుకు తాను స్వయంగా సంఘటన స్థలాన్ని సందర్శిస్తాననని, హింసను ప్రోత్సహించే రాజకీయాలను బీజేపీ సహించదని రామచందర్రావు హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





