– అమెజాన్తో సంప్రదింపులు జరుపుతున్నాం
– మహిళల ఉన్నతి-తెలంగాణ ప్రగతి పేరిట చీరల పంపిణీ
– మహిళా సంఘాలతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లేందుకు అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి ఆయన బుధవారం నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీని ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లాల్లోని మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్సీ) సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతీ ఆడబిడ్డను తోబుట్టువుగా భావించి ప్రజా ప్రభుత్వం అర్హులైన కోటిమంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. మహిళా ఉన్నతి- తెలంగాణ ప్రగతి పేరిట ప్రతి మండల కేంద్రంలో చీరల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సూచించారు. ప్రజా ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే (సీపెక్) డాటాను దగ్గర పెట్టుకొని ప్రతి మహిళకు చీర అందేెలా చూడాలని, చీర అందించే సమయంలో ఆధార్తోపాటు ముఖ గుర్తింపు చేపట్టాలని సీఎం కలెక్టర్లకు సూచించారు.
అవకాశం ఉన్నచోటల్లా మహిళలకు ప్రోత్సాహం
మహిళల ఉన్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల విషయంలో నిర్లక్ష్యం వహించగా తాము ఆ రుణాలతోపాటు అందుకు సంబంధించిన నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడమే కాక ఆ బస్సులకు మహిళలను యజమానులను చేశామన్నారు. యూనిఫాంలు కుట్టే బాధ్యతను అప్పజెప్పడంతో మహిళా సంఘాలకు రూ.30 కోట్ల ఆదాయం సమకూరిందని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో రూ.534 కోట్ల పనులు చేపట్టామని, ధాన్యం కొనుగోళ్లు మహిళా సంఘాలకే అప్పజెప్పామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలనే లక్ష్యంతో అమెజాన్తో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడిరచారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళల గౌరవం పెంచాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతోందన్నారు. రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందిస్తున్నామని తెలిపారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణతో బ్యాంకులు రుణాలిచ్చేందుకు సంఘాల దగ్గరకు వస్తున్నాయని తెలిపారు. ఆకాశమే హద్దుగా మహిళలు ఎదగాలనే ఉద్దేశంతో చీరలకు ఆకాశం రంగును ఎంచుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.
మీ పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోంది:
మీ సంఘం ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్ ఎలా నడుస్తోందని నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అరుంధతిని ముఖ్యమంత్రి అడిగారు. బాగా నడుస్తోందని, నెలకు రూ.4 లక్షల రాబడి వస్తోందని ఆమె సీఎంకు చెప్పారు. ఇతర జిల్లాల నుంచి సంఘాలను అక్కడకు తీసుకెళ్లి వారి పని తీరు, రాబడిని ప్రత్యక్షంగా చూపాలని కలెక్టర్లకు సీఎం సూచించారు..
డిజైన్లు ఎంతో బాగున్నాయి
తమకు ఇస్తున్న చీరల డిజైన్లు ఎంతో బాగున్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
మాకు యూనిఫాం ఇచ్చినట్లు ఉంది
ఇందిరా మహిళా శక్తి చీరలు ఇవ్వడం ద్వారా తమకు యూనిఫాం వచ్చిందనే సంతోషం ఉందని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు శ్రీదేవి తెలిపారు. ఈ చీరలు ధరించడం ద్వారా తమ సంఘాల మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





