– ‘ఫెలోస్ ఇండియా–2026’తో మెడికవర్ హాస్పిటల్స్ మరో ముందడుగు
– దేశ, విదేశీ కార్డియాలజిస్టులతో ప్రతిష్టాత్మక కార్యక్రమం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 10 : హృదయ వైద్య రంగంలో తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో మెడికవర్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రతిష్టాత్మక “ఫెలోస్ ఇండియా 2026” అధునాతన ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈనెల 9 నుంచి 11 వరకు నోవోటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు జరిగిన ఈ అకడమిక్ సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రముఖ కార్డియాలజిస్టులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా హైదరాబాద్ నగరం దేశంలోని యువ హృదయ వైద్యులకు ముఖ్యమైన శిక్షణ కేంద్రంగా మరోసారి నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్డియాలజీ ఫెలోస్, యువ కన్సల్టెంట్లు ఆధునిక హృదయ చికిత్సలపై లోతైన అవగాహన పొందారు. మూడు రోజుల శాస్త్రీయ సదస్సుల్లో క్లిష్టమైన కోరొనరీ యాంజియోప్లాస్టీలు, స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ చికిత్సలు, ఆధునిక వాల్వులర్ ప్రక్రియలు, కొత్త వైద్య పరికరాలు, భవిష్యత్తు హృదయ వైద్యం అంశాలపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఎన్.ప్రతాప్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ను దేశంలోని ప్రముఖ కార్డియాలజీ శిక్షణ కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని తెలిపారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ శరత్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించవచ్చన్నారు. హాస్పిటల్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కృష్ణ జి. మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ప్రపంచస్థాయి హృదయ వైద్యం అందించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



