-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా బీజేపీ సికింద్రాబాద్ డివిజన్, జిల్లా నాయకులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాచందర్రావు ఆయనకు గురువారం పుష్పాంజలి ఘటించారు. శివాజీ మహరాజ్ అపార ధైర్యం, దూరదృష్టి నాయకత్వం, స్వరాజ్యంపై ఆయనకు ఉన్న అచంచల నిబద్ధతను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన జీవితం దేశ సేవలో అంకితభావం, ఆత్మగౌరవం, దృఢ సంకల్పంతో ముందుకు సాగేందుకు మనందరికీ నిరంతరం ప్రేరణనిస్తుందని అన్నారు. హిందూ హృదయ సామ్రాట్, హైందవ సామ్రాజ్య స్థాపననే ధ్యేయంగా మొఘలాయిలతో అఖండ ధైర్యంతో పోరాడిన ధీరుడు, భారతమాత వీరపుత్రుడు అయిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు శివాజీకి ఘనంగా నివాళులర్పించారు. ఈ వేడుకల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, రాష్ట్ర పదాధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, గొప్ప యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా దేశ, రాష్ట్ర ప్రజలకు, బీజేపీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శివాజీ కేవలం ఒక మరాఠా యోధుడే కాక మొఘలులతో పోరాడి దేశ గౌరవాన్ని కాపాడిన మహనీయుడిగా యావత్ భారత దేశానికి గర్వకారణమని చెప్పారు. ఆయన పాలనలో పరిపాలనా దక్షత, ప్రజాహిత సంస్కరణలు దేశమంతటికీ ఆదర్శంగా నిలిచాయన్నారు. రెవెన్యూ వ్యవస్థ, భద్రతా విధానాలు, వ్యవసాయ రంగంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయని తెలిపారు. శివాజీ మహరాజ్ చూపిన మార్గంలో ప్రతిఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని, ఆయన పరిపాలన విధానాలు, ధర్మపాలన, దేశభక్తి భావనలను ప్రతి భారతీయుడు అనుసరించాలని రామచందర్రావు కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





