– ప్రజాపాలన వారోత్సవాల అనంతరం నోటిఫికేషన్
- కేబినెట్లో మంత్రులతో చర్చించిన సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్,ప్రజాతంత్ర,నవంబర్17: స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మరోవైపు సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యే, మైనార్టీ విభాగానికి చెందిన ఓ అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని సూచించింది. చనిపోయిన వారి మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం.. అక్కడే అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించింది. బిసి రిజర్వేషన్ల వ్యవహారంతో ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఉంటుందని పేర్కొంది. ప్రజాపాలన వారోత్సవాల తర్వాతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయని మంత్రివర్గ భేటీ స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు తెలంగాణ ప్రజాపాలన వారోత్సవాలు జరగనున్నాయి. వారోత్సవాల సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా సర్పంచ్ సహా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల తరవాతే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గ భేటీలో చర్చించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితంనే లోకల్ బాడీ ఎలక్షన్లలో పునరావృతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల పదవీకాలం ముగిసి 20 నెలలు పూర్తయ్యాయి. ఇటీవల బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై హైకోర్టు, సుప్రీం కోర్టు వ్యతిరేకంగా తీర్పు నిచ్చాయి. రిజర్వేషన్లు 50శాతం దాటరాదన్న నిబంధనలను పాటించాలని సూచించాయి. మొత్తానికి డిసెంబర్లో ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నాడు రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించినట్లు సమాచారం.
ఇప్పటికే ఎన్నికల నిర్వహణ ఆలస్యమైన నేపథ్యంలో ఇక ఆలస్యం చేయొద్దని.. వీలైనంత తర్వగా లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలని నిర్ణయించింది మంత్రివర్గం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్న నేపథ్యంలో తమ ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందనే విషయాన్ని ప్రజాపాలన వారోత్సవాల్లో వివరించాలని మంత్రివర్గం తీర్మానించింది. గ్రామ స్థాయిలో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రచారం చేసి.. లోక్బాడీ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేయాలని నిర్ణయించింది. ప్రజాపాలన వారోత్సవాలతో గ్రామ స్థాయి కేడర్లో మరింత ఉత్సాహం నింపి స్థానిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించాలని భావిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





