ప్రభుత్వానికి-ప్రజలకు మధ్య వారధి జర్నలిజం

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి వుంది
– సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రియాంక‌

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 24: ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడానికి జర్నలిజం వారధి అని, రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని సమాచార శాఖ  ప్రత్యేక కమిషనర్ సి.ప్రియాంక అన్నారు. గురువారం నాంపల్లి మీడియా అకాడమీలో రంగారెడ్డి జిల్లా జర్నలిస్టుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జర్నలిస్టుల ప్రయోజనం కోసం అవసరమైన సౌకర్యాలను అందించడంలో మీడియా అకాడమీ ప్రముఖ పాత్ర పోషిస్తుందని, అకాడమీకి అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని ఆమె అన్నారు. పాత రోజుల్లో వార్తలను అందించే పద్ధతి చాలా కష్టంగా ఉండేదని, కానీ ఇప్పుడు వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా వార్తల సమాచారం అందరికీ సెకన్లలో చేరుతుందని ఆమె అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల మధ్య జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు అందించడంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని ఆమె అన్నారు. ఈ సమాజంలో ఏమి జరిగిందో ప్రజలకు నిజాయ‌తీగా, నిక్క‌చ్చిగా తెలియజేయాలని, మీరు అందించే సమాచారం ఆధారంగానే ప్రజలు విషయాలు తెలుసుకుంటారని ఆమె అన్నారు. అకాడమీ ద్వారా మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్ అందించడం, వారికి సహాయం చేయడం వల్ల చాలా మంది పిల్లల చదువుకు గొప్ప ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుందని, వారికి సంబంధించిన బీమా పథకంలో ఉన్న లోపాలను సరిదిద్ది సక్రమంగా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. విధుల్లో ఉండి ప్రమాదాల్లో గాయపడి పని చేయలేని వారికి ఆర్థిక సహాయం అందిస్తామని, ప్రభుత్వం అనేక ఇతర సంక్షేమ పథకాలను అందిస్తుందని, ప్రభుత్వం తన శాఖ ద్వారా జర్నలిస్టులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తుందని ఆమె అన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల ప్రమాదాలకు గురై పని చేయలేని 180 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. అదేవిధంగా, మరణించిన వారి కుటుంబ సభ్యులకు అకాడమీ రూ. 3 వేల పెన్షన్ అందిస్తుందని చెప్పారు. వారి పిల్లల ఎల్‌కేజీ నుండి 10వ తరగతి వరకు చదువుకు అవసరమైన ఫీజులను అకాడమీ చెల్లిస్తుందని ఆయన అన్నారు. అకాడమీ ద్వారా ఎడిటర్లు,  మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక శిక్షణ తరగతులు, సెమినార్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో మూడు రోజుల్లో నైపుణ్యం కలిగిన జర్నలిస్టులకు శిక్షణ ఇవ్వడానికి మరికొన్ని జిల్లాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తామని, జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు. ఈ రోజు ప్రసంగాలలో దిశ ఎడిటర్ మార్కండేయ వార్తలు,  కథనాలపై సంక్షిప్త ప్రజెంటేషన్లు ఇచ్చారు. సీనియర్ జర్నలిస్ట్ గోవింద రెడ్డి క్రైమ్ న్యూస్ పై, 99టీవీ చీఫ్ ఎడిటర్ బాలనారాయణ  డిజిటల్ మీడియాపై ప్రసంగించారు. సమావేశంలో రంగారెడ్డి జిల్లా డీఆర్‌డీఏ పిడి  శ్రీలత డీఆర్‌డీఏ విధానాలను, సెర్ఫ్  ద్వారా మహిళలకు అందించే వడ్డీ లేని రుణాలను వివరించారు. అనంతరం శిక్షణ పొందిన జర్నలిస్టులకు సర్టిఫికెట్లను అందజేశారు. మీడియా అకాడమీ కార్యదర్శి ఎన్. వెంకటేశ్వరరావు, రంగారెడ్డి జిల్లా ప్రజా సంబంధాల అధికారి పి.సి. వెంకటేశం పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *