– బుల్కాపూర్ నాలాలో పేరుకుపోయిన చెత్త
– క్షేత్ర స్థాయిలో పరిశీలించిన హైడ్రా కమిషనర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: నాలాల్లో వరద సాఫీగా సాగేలా చూడాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజలకు సూచించారు. నాలాల్లో ఎక్కడైనా ఆటంకాలుంటే వెంటనే తొలగించాలని అధికారులు, సిబ్బందిని ఆదేశిస్తూ వరద నీరు సాఫీగా సాగితే అనేక ప్రాంతాలకు వరద ముప్పు తప్పుతుందని అన్నారు. బుల్కాపూర్ నాలాతోపాటు ముషీరాబాద్లోని నాలాను హైడ్రా కమిషనర్ క్షేత్రస్థాయిలో శుక్రవారం పరిశీలించారు. సుదూర ప్రాంతాల నుంచి హుస్సేన్సాగర్కు వర్షపు నీటిని తీసుకువచ్చే బుల్కాపూర్ నాలాలో వంద మీటర్ల పరిధిలో 50 లారీల చెత్త పేరుకుపోయి ఉండడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఆ నాలాలో చెత్త తొలగింపు పనులను పరిశీలించారు. అలాగే ప్యాట్నీ నాలా విస్తరణ పనులపై హైడ్రా కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.





