– ఫిజికల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా స్మార్ట్ సిటీ నిర్వహణ
– ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 20: హైదరాబాద్ను దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం వీలైనంత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. అనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్మన్ సీఎంను గురువారం ఉదయం కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను చర్చించారు. ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, సరస్సుల రక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించే మార్గాలను చర్చించారు. ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ ఆధారంగా రియల్ టైమ్ సెన్సార్ నెట్వర్క్, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులను అమలు చేసే వీలుందని అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా హైదరాబాద్ సిటీలో ఫిజికల్ ఇంటెలిజెన్స్ ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించారు. ఎనిమిది వారాల పాటు ఈ ప్రోగ్రాం అమలవుతుంది. ఇందులో భాగంగా సీసీ టీవీ వ్యవస్థను రియల్ టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫారమ్గా మారుస్తారు. ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవలన్నీ ఏఐ ఆధారిత అంచనాలతో ఒకేచోట సమన్వయం చేస్తారు. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్గా దీన్ని మానిటరింగ్ చేస్తారు. ఈ పైలెట్ ప్రోగ్రాం పూర్తయ్యేనాటికి హైదరాబాద్ దేశంలోనే తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ సిటీగా మారుతుందనే అంచనాలున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీని పరిశోధన, సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను వివరించారు. ఆర్థిక వృద్ధికి సైతం ఫిజికల్ ఇంటెలిజెన్స్ అత్యుత్తమ పరిష్కారాలను అందిస్తుందని కిప్మన్ తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. డిసెంబర్ 8–9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని సీఎం ఆయనను ఆహ్వానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





