– అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దడమే ప్రాధాన్యం
– యూఎస్ఐఎస్పీఎఫ్ వార్షిక సమ్మిట్లో ముఖ్యమంత్రి రేవంత్
– సమ్మిట్లో తెలంగాణ రైజింగ్-2047 విజన్ ప్రదర్శన
– ముఖ్యమంత్రి విజన్పై ప్రశంసలు కురిపించిన టెక్ దిగ్గజాలు
దిల్లీ, నవంబర్ 13: అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎలాంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. దిల్లీలో గురువారం జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు-భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు (యూఎస్ఐఎస్పీఎఫ్)లో ముఖ్యమంత్రి ప్రసంగించారు. తెలంగాణలో గత 35 ఏళ్లుగా కాంగ్రెస్తోపాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారంటూ భారత దేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని వివరించారు. జీసీసీలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులకు ముందుకు రావాలంటూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితోపాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయస్థాయి నగరంగా హైదరాబాద్ను నిలపడమే తన ప్రథమ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారత దేశంలోనే నూతన నగరంగా మారుతుందని తెలిపారు. మూసీ నదీ పునరుజ్జీవం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సీఎం అన్నారు. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్-త్రిబుల్ ఆర్ మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతిని వివరించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చైనా ం1 మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుంది అని అన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందంటూ ముఖ్యమంత్రి ప్రపంచస్థాయి విద్యా సంస్థలను ఆహ్వానించారు. దేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని.. హైదరాబాదులో ఆ ట్రెండ్ను మార్చాలని తాము అనుకుంటున్నామని, ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని సీఎం చెప్పారు. సదస్సు ప్రారంభంలో తెలంగాణ రైజింగ్I2047 విజన్ను ప్రదర్శించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఈ సమావేశంలో విశేష ఆదరణ పొందింది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు వివరించిన సీఎం ప్రసంగం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది.
రేవంత్ రెడ్డి విజన్ బోల్డ్, క్లియర్, అచీవబుల్ : జాన్ ఛాంబర్స్, సిస్కో మాజీ సీఈఓ, టెక్ దిగ్గజం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ పారదర్శకంగా, సాహసోపేతంగా (బోల్డ్), సాధించగలిగేలా ఉంది. ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయి.
గ్లోబల్ సమ్మిట్కు హాజరవుతాం: డాక్టర్ ముఖేష్ ఆఘి, యూఎస్ఐఎస్పీఎఫ్ అధ్యక్షుడు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు మా సభ్యులలో అత్యధికులం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరవుతాం. తెలంగాణ విజన్ను దగ్గరగా తెలుసుకోవాలని మేమంతా ఆసక్తిగా ఉన్నాం.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





