– రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు
– రాహుల్ పై పెడుతున్న కేసులను బీఆర్ ఎస్ నాయకులు సమర్థించడమేంటి?
– కేసులపై స్పందించాల్సిన అవసరం రాహుల్కు లేదు
– తీరు మార్చుకోండి: మంత్రి శ్రీధర్ బాబు హితవు
అధికారంలో ఉన్నపుడు అపవిత్రంగా కనిపించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు పవిత్రంగా కనిపిస్తున్నదా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రశ్నించారు. ఇప్పుడు పొగుడుతున్న దర్యాప్తు సంస్థే గతంలో కవితపై కేసు నమోదు చేసిన సంగతిని మర్చిపోయారా? అంటూ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 60 ఏళ్ల కలను సాకారం చేస్తూ సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇస్తే పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను దెయ్యంలా పట్టి పీడించిందని ఆయన అన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ నియంతృత్వ పాలనతో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఆ పార్టీ నాయకులకు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదన్నారు.
“ఈడీ”ని పావుగా చేసుకొని కేడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేలా కాంగ్రెస్ అగ్ర నాయకులపై బీజేపీ పెడుతున్న అక్రమ కేసులను బీఆర్ఎస్ నాయకులు సమర్థించడం వెనుకున్న చీకటి ఒప్పందాన్ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మార్గ నిర్దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఆధారాల్లేకుండా బీజేపీ పెడుతున్న అక్రమ కేసులపై స్పందించాల్సిన అవసరం రాహుల్ గాంధీకి లేదన్నారు. ఆయన గురించి మాట్లాడే కనీస అర్హత కూడా బీఆర్ ఎస్ నాయకులకు లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారడం, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ఆ పార్టీ నాయకులు మాపై విమర్శలు చేస్తున్నారన్నారు.
జాతీయ పార్టీలో నిర్ణయాలన్నీ అధినాయకత్వమే తీసుకుంటుందనే కనీస అవగాహన పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు లేకపోవడం దురదృష్టకరమన్నారు. సమాఖ్య వ్యవస్థలో కేంద్రంతో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుందనే విషయం, అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు పట్టకుండా కేంద్రంతో తరచూ తగువు పెట్టుకున్న మీకెలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. రాష్ట్రం కోసం ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలవడంలో తప్పేముందని, ఈ విషయంలో ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన తరచూ ఢిల్లీకి వెళ్లడం వల్లే సికింద్రాబాద్ నుంచి శామీర్ పేట్ వరకు నిర్మించతలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్, కాజీపేట్ లో కోచ్ ఫ్యాక్టరీ, జహీరాబాద్ నిమ్జ్ విషయంలో కదలికొచ్చిందనే విషయాన్ని మరవొద్దన్నారు.
మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ గాడి తప్పిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్న తమపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రుణ మాఫీ, రైతు భరోసా, మహాలక్ష్మి పథకం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ యువ వికాసం, ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాలు మీ కంటికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ గా నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ నాయకులు విమర్శించడం సరికాదన్నారు. ఆయన నచ్చాల్సింది తెలంగాణ ప్రజలకు, మీకు, మీ కేడర్ కు కాదన్నారు. మీరు నచ్చకే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశమిచ్చారనే విషయాన్ని మరువొద్దన్నారు. ఇప్పటికీ మీరే అధికారంలో ఉన్నట్లుగా ప్రవర్తించడం మీకే మంచిది కాదని హితవు పలికారు. ఒక ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు




