యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు
యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, జులై 9: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరితగతిన వాటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, ఇళ్లు పూర్తి అయిన లబ్ధిదారులకు విడతల వారీగా రూ.5 లక్షలు లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతి సోమవారం జమ చేయనున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. వలిగొండ మండలంలోని నాతాళ్లగూడెం గ్రామంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుతో కలెక్టర్ మాట్లాడుతూ తమ ఇంటి నిర్మాణాలు పూర్తిచేసుకోవాలన్నారు. ఇసుక, సిమెంట్, స్టీల్, ఇటుక కూడా తక్కువ రేట్లుకు ఇస్తామని యజమానులకు సూచించారు. ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా లబ్ధిదారులకు సరఫరా అయ్యే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మేస్త్రీలతో మాట్లాడి నాణ్యతాప్రమాణాలు పాటిస్తూ వేగంగా ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



