– ‘క్యూర్’ పరిధిలో మొదటి విడత ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ
– నివాసంలో లేని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్దిదారులకు నోటీసులు
– ఏప్రిల్ 30వరకు గడువు
– హౌసింగ్ పై మంత్రులు శ్రీధర్బాబు, అజారుద్దీన్, పొన్నంతో కలిసి మంత్రి పొంగులేటి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: హైదరాబాద్,రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల క్యూర్ ( కోర్ అర్భన్ రీజియన్ ఎకానమీ) పరిధిలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మాణానికి అవసరమైన కార్యాచరణను సిద్దం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో నివసించే పేద ప్రజల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా స్ధలాలను గుర్తించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని దీనికి తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. సోమవారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో సహచర మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, పొన్నం ప్రభాకర్లతో కలిసి క్యూర్ ఏరియాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డబుల్ బెడ్ రూం ఇళ్ల పై సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు, అలాగే డబుల్ బెడ్ రూం ఇళ్లకు పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక ఉండాలని ఎలాంటి రాజకీయ వత్తిళ్లకు తలోగ్గవద్దని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు పొంది వాటిలో నివసించకుండా అద్దెకు ఇస్తున్నవారికి, ఏళ్ల తరబడి తాళాలు వేసి ఖాళీగా ఉంచుతున్నవారికి నోటీసులు జారీ చేయాలని , నోటీసులకు స్పందించని వారి ఇళ్లను రద్ధు చేసి అర్హులైన పేదలకు కేటాయించాలని ఆదేశించారు. ఇప్పటి వరకు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, ఎంతమంది స్పందించారు అక్కడ నివాసం ఉండకపోవడానికి వారు చెప్పిన కారణాలపై ఆరా తీశారు. 2 బిహెచ్కే, జెఎన్ ఆర్.ఎమ్ తదితర పథకాల్లో ఇళ్లు పొంది నివాసం ఉండని ఇళ్లను మే 1వ తేదీ నుంచి పరిశీలించాలని అటువంటి వారికి నోటీసులు ఇచ్చి, స్పందించని పక్షంలో కేటాయింపులను రద్దు చేయాలని స్పష్టం చేశారు. నోటీసులపై స్పందించిన లబ్దిదారుల నుంచి బాండు పేపరుపై తాము ఇక్కడే నివాసం ఉంటామని లేదంటే రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి అప్పగిస్తూ వారి నుంచి హామీ పొందాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు ఆమోదం తెలిపేలా అండర్ టేకింగ్ తీసుకోవాలని సూచించారు. నాలుగు జిల్లాల పరిధిలోగల కాలనీల్లో ముఖ్యంగా విద్యుత్, త్రాగునీరు, డ్రైనేజ్ వంటి కనీస వసతులను తప్పని సరిగా కల్పించాలని, ఈ విషయంలో జిహెచ్ ఎంసీ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా 22వేల ఇళ్లకు విద్యుత్ మీటర్లను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం టవర్లు మొత్తం పూర్తయ్యేవరకూ ఆగకుండా పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు లబ్దిదారులకు కేటాయించాలన్నారు. అదేవిధంగా వివిధ కాలనీల్లో ఉన్న వాణిజ్య సముదాయాలను అద్దె ప్రాతిపదకన గాకుండా వేలం పద్దతిలో వాటిని విక్రయించాలని ఆ విధంగా వచ్చిన డబ్బును అక్కడి సొసైటీ, ప్రభుత్వం పేరిట జాయింట్ అకౌంట్ పేరిట వేయాలన్నారు. అంతేగాక ప్రజా ప్రయోజన కార్యాలయాల కోసం కూడా కొన్నింటిని కేటాయించాలని తెలిపారు. ఈ విషయంలో సహకార శాఖ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి, ఎండీ, వీపీ గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





