హైదరాబాద్, మార్చి 14 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా సుదీర్ఘ కాలం సేవలు అందించి, అలుపెరుగని సంస్కర్తగా పేరుగాంచిన దివంగత డిజిపి హెచ్.జె.దొర అంత్యక్రియలు శనివారం జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో పలువురి అశ్రునయనాల మధ్య ముగిశాయి. జూబ్లీహిల్స్లోని ఆయన స్వగృహం నుండి శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన అంతిమయాత్రలో పోలీసు అధికారులు, సిబ్బంది, అభిమానులు పాల్గొనగా, మహాప్రస్థానం వద్ద అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు మధ్యాహ్నం వరకు ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన పలువురు ఉన్నతాధికారులు, ప్రముఖులు ఘన నివాళులర్పించారు. తన మార్గదర్శికి అంతిమ గౌరవం సమర్పిస్తూ డిజిపి బి.శివధర్ రెడ్డి స్వయంగా పాడె మోశారు. ఆయనతోపాటు హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం.రమేష్ కూడా పాడె మోసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎస్పీగా ఉన్న తొలినాళ్లలో తనను ప్రోత్సహించిహెచ్.జె.దొర సొంత జిల్లా అయిన శ్రీకాకుళానికి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చి విధి నిర్వహణలో దిశానిర్దేశం చేసిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా డిజిపి గుర్తుచేసుకున్నారు. మాజీ డిజిపి జితేందర్, ఐపిఎస్ అధికారులు రాజీవ్ త్రివేది, ఎస్.చంద్రశేఖర్ రెడ్డి , ఐఎస్డబ్ల్యు, ఓఎస్డి కమలాసన్ రెడ్డి తదితరులు పార్థివ దేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. పోలీస్ వ్యవస్థకు హెచ్.జె.దొర చేసిన సేవలు స్మరించుకుంటూ వీడ్కోలు పలికారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





