హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 27: సిగాచీ ఇండస్ట్రీస్ లో పేలుళ్ల ఘటనపై పోలీసుల దర్యాప్తుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ సందర్భంగా పోలీసుల విధి నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పేలుడులో 54 ముంది కార్మికులు మృతిచెందారని గుర్తుచేస్తూ ‘ఇది సాధారణ ఘటన కాదు. ఇంత భారీ ప్రాణ నష్టం జరిగిన ఘటనలో ఇప్పటికీ ‘దర్యాప్తు కొనసాగుతోంది’ అని దెప్పడం ఎలా?’ అని కోర్టు ఏఏజీని ప్రశ్నించింది. ఏఏజీ చేసిన ‘దర్యాప్తు కొనసాగుతోంది’ వ్యాఖ్యపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 237 మంది సాక్షుల్ని విచారించాం అనడం ఏం ప్రయోజనం? ఇంకా బాధ్యులు ఎవరో నిర్ణయించలేదా అని ప్రశ్నించింది. ఇంత భారీ ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు అధికారి స్థాయిని కూడా కోర్టు ప్రశ్నించింది. ఇంత పెద్ద ఘటనలో డీఎస్పీని దర్యాప్తు అధికారిగా ఎందుకు నియమించారు? ప్రత్యేక దర్యాప్తు బృందం ఎందుకు ఏర్పాటు చేయలేదు అని కోర్టు నిలదీసింది. పోలీసు దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి డీఎస్పీ స్వయంగా కోర్టుకు హాజరవ్వాలని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెల 9వ తేదీకి వాయిదా వేసింది. పరిశ్రమ నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యం ఉందని నిపుణుల కమిటీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా 17 టన్నుల సోడియం క్లోరైడ్ నిల్వ చేసినట్లు పోలీసులు గుర్తించారు. పేలుడు తీవ్రత వల్ల 8మంది కార్మికుల శరీరాలు పూర్తిగా దగ్ధమై ఆనవాళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




