– స్పష్టం చేసిన హైకోర్టు
హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 1: హైకోర్టులో కెసిఆర్,హరీష్ రావులకు మరోమారు చుక్కెదురయ్యింది.కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఆపాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని తెలంగాణ హైకోర్టు సోమవారం తేల్చిచెప్పింది. కాళేశ్వరం నివేదిక అంశాన్ని కేసీఆర్, హరీశ్ మరోసారి హైకోర్టు దృష్టికి తెచ్చారు. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూడాలనిహరీష్ తరపు న్యాయవాదులు పిటిషన్లో కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్పై అత్యవసరంగా విచారించాలని కోరారు. విచారణ జరిపిన హైకోర్టు హరీష్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. సీబీఐ విచారణను ఆపాలంటూ ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. తదుపరి విచారణను సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పై ఆదివారం అసెంబ్లీలో పది గంటల పాటు సుదీర్ఘ చర్చ అనంతరం సంచలన ప్రకటన చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికలో ఎన్నో విచారణార్హమైన అంశాలు, అంతర్రాష్ట్ర వ్యవహారాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నందున సీబీఐ విచారణకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు కాళేశ్వరం నివేదికపై హైకోర్టును ఆశ్రయించారు. ఆదివారం హైకోర్టులో మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. ఘోష్ నివేదికను ఆధారంగా చేసుకుని తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, నిన్న విచారణ చేయడానికి కోర్టు నిరాకరించింది. దీంతో సోమవారం అదే బెంచ్లో లంచ్ మోషన్ పిటిషన్ వేసి విచారణ జరపాలని కోరారు. కోర్టు లంచ్ మోషన్కు కూడా స్వీకరించలేదు. రెగ్యులర్ పిటిషన్లలాగే ఆ పిటిషన్ను కూడా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపింది. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విచారణ చేస్తామని పేర్కొంది. రేపటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించలేమని, సీబీఐ విచారణ ఆపాలనీ ఆదేశించలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా హైకోర్టులో కేసీఆర్ తరఫు న్యాయవాది సుందరం మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని చీఫ్ జస్టిస్ ముందు ప్రస్తావించారు. ఇద్దరినీ ఉరి తీయాలని ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడారని అన్నారు. కేసును సీబీఐకి అప్పగించాలని అసెంబ్లీలో నిర్ణయం జరిగినట్లు వెల్లడించారు. అందుకే అత్యవసరంగా పిటిషన్ను విచారించాలని కోరుతున్నామన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కాగా, మంగళవారం నాడు ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.
———————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





