తుపాకి సరఫరా కేసు.. నిందితుడికి ముందస్తు బెయిల్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జులై 17: హైదరాబాద్‌ గచ్చిబౌలి ప్రిజం పబ్‌ కాల్పుల కేసులో అరెస్టు అయిన బత్తుల ప్రభాకర్‌కు తుపాకి సరఫరా చేసిన అభియోగాలను ఎదుర్కొంటున్న నిందితుడు రామేంద్ర కుమార్‌ రవికి హైకోర్టులో ఊరట లభించింది. గురువారం ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. దాదాపు 80 క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌ 2025 ఫిబ్రవరిలో గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌లో ఒక పోలీసు అధికారిపై కాల్పులు జరిపిన ఘనటపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రభాకర్‌ను అరెస్టు చేసి విచారణ జరపగా తుపాకీని బిహార్‌ నుంచి తెచ్చినట్లు తేలింది. దీంతో బిహార్‌కు చెందిన సివిల్‌ ఇంజనీర్‌ రామేంద్ర కుమార్‌ రవిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. పోలీసులు కేసు నమోదు చేయడంతో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని, ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ రామేంద్ర వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ శ్రీనివాస్‌రావు విచారణ జరిపారు. అతడికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ మంజూరు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *