– ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 22ః చెరకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పరిష్కారాలు సూచించేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమిస్తున్నట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. సచివాలయంలో ఆయన చెరుకు రైతులు, పరిశ్రమల ప్రతినిధులు, చెరుకు అభివృద్ధి మండళ్ల (సిడిసి) ఛైర్మన్లతో శనివారం ఉన్నత స్థాయి సమీక్షా సమేవేశం నిర్వహించారు. తెలంగాణాలో ఏటా చెరుకు సాగు విస్తీర్ణం తగ్గుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలోని చక్కెర పరిశ్రమల సమస్యలు కూడా పరిష్కరించాలన్న సంకల్పంతో సిఎం రేవంత్ రెడ్డి ఉన్నారని శ్రీధర్ బాబు తెలిపారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ప్రధాన అంశాలపై అందరితో చర్చించి నివేదిక రూపొందించేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించనున్నట్టు ఆయన వెల్లడించారు. ఇందులో సంబంధిత శాఖల అధికారులు, చక్కెర పరిశ్రమల ప్రతినిధులు కూడా ఉంటారని చెప్పారు. ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో చెరుకు రైతులకు అందుతున్న ప్రయోజనాలు, రాయితీలపై అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరలో నివేదిక అందిస్తుందని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రతి క్వింటాలు సన్న ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.500 బోనస్ ను చెరుకు పంటకు కూడా వర్తింపచేయాలని రైతులు కోరుతున్న విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని శ్రీధర్ బాబు అన్నారు. చెరుకు హార్వెస్టర్ యంత్రాలపై గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 50 శాతం సబ్సిడీని ఇవ్వగా ఆ తర్వాత వచ్చిన బిఆరెస్ ప్రభుత్వం ఆ రాయితీని తొలగించిన విషయం రైతులు చెబ్తున్నారని ఆయన వెల్లడించారు. కూలీల సమస్య వల్ల చెరుకు నరకడం రైతులకు సమస్యగా మారిందని అన్నారు. తన నియోజకవర్గం మంథనిలో పత్తి తీసే కూలీల కొరత వల్ల ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర నుంచి లేబర్ వస్తున్న విషయం తనకు తెలుసునని శ్రీధర్ బాబు వివరించారు. డ్రిప్ ఇరిగేషన్ రాయితీని చెరుకు పంటకు కొనసాగించాలని రైతులు కోరుతున్న విషయపై కూడా అధికారుల కమిటీ నివేదిక ఇస్తుందని తెలిపారు. డ్రిప్ పరికరాల వల్ల ప్రతి ఎకరానికి 8-9 టన్నుల దిగుబడి పెరుగుతుందని అధికారులు చెబ్తున్నారని అన్నారు. చెరుకు రవాణా ఛార్జీలను కొంత మేరకు భరించే అంశాన్ని కూడా కమిటీ అధ్యయనం చేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణాలోని ప్రైవేటు రంగ చక్కెర పరిశ్రమలను కాపాడుకుంటామని తెలిపారు. నిజాం షుగర్స్ పునరుద్ధరణ విషయంలో వారి అనుభవాన్ని వినియోగించుకుంటామని తెలిపారు. కార్మికులు, రైతుల శ్రేయస్సుకు తమ ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని వివరించారు. ఏపీలో చక్కెర రికవరీ శాతం 9 శాతం ఉండగా, రాష్ట్రంలో 11 శాతం వరకు వస్తుండటం సంతోషం కలిగించే అంశమని చెప్పారు. చెరుకు విస్తీర్ణం పెరిగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు వెల్లడించారు. సమావేశంలో తెలంగాణా పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ ఛైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, చక్కెర పరిశ్రమల డైరెక్టర్ నర్సిరెడ్డి, పలువురు అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, సిడిసి ఛైర్మన్లు, రైతులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




