- ఎసిబి కేసులో క్వాష్ పిటిషన్ కొట్టివేత
- విచారణకు ఎసిబికి అనుమతించిన హైకోర్టు
బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టు షాకిచ్చింది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఫార్ములా ఈ–రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 31న ఇరువైపుల వాదనలు ముగించిన హైకోర్టు.. మంగళవారం తీర్పు వెలువరించింది. కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఉపసంహరించింది. ఏసీబీ అరెస్ట్ చేయకుండా 10 రోజుల పాటు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించాలన్న కేటీఆర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై కేటీఆర్ తన న్యాయవాదులతో చర్చిస్తున్నారు. దీనిపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ–రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనను కూడా వినాలని ముందస్తుగానే పిటిషన్ వేసింది. ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్రెడ్డి వాదనలు వినిపించారు. ఫార్ములా
– ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ – కార్ల రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని.. అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిశోర్ వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. నిందితులు అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం ప్రశ్నించారు. ఇప్పటివరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ తెలిపారు. దానకిశోర్ తరఫున సీనియర్ న్యాయవాది సీపీ మోహన్రెడ్డి వాదనలు వినిపించారు. పురపాలక శాఖ మంత్రి పర్యవేక్షణలోనే ఆ శాఖ అధికారులు విధులు నిర్వహిస్తారన్నారు. రేసింగ్కు సంబంధించిన చెల్లింపుల దస్త్రాన్ని అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆమోదించారని కోర్టుకు తెలిపారు. రేసింగ్ వ్యవహారంలో అన్ని రకాల నిబంధనలను ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ దవే వాదనలు వినిపించారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్లు కేటీఆర్కు వర్తించవని కోర్టుకు తెలిపారు. నగదు బదిలీలో కేటీఆర్ ఎక్కడా లబ్దిపొందలేదని, అవినీతి జరిగినట్లు కూడా ఎఫ్ఐఆర్లో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. ఫార్మూలా–ఈ కార్ల రేసు నిర్వహణపై జరిగిన ఒప్పందంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, ఫార్ములా –ఈ ఆపరేషన్స్ సంస్థ సంతకాలు చేశాయని ఆయన వాదించారు. పురపాలక శాఖకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ను ఎఫ్ఐఆర్లో నిందితుడిగా చేర్చడం తగదన్నారు.
ఈ మేరకు పలు హైకోర్టు తీర్పులను సిద్దార్థ్ దవే ప్రస్తావిస్తూ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరారు. ఈ కేసులో ఏసిబి వాదనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కొద్దిసేపటిక్రితమే కెటిఆర్ క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. కాగా, సోమవారం ఏసిబి విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. కెటిఆర్ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. తన లాయర్ ను ఏసిబి కార్యాలయంలోకి అనుమతించకపోవడంతో ఆయన విచారణకు హాజరవ్వకుండానే తిరిగి వెళ్లిపోయారు. దీంతో విచారణకు హాజరవ్వాలని మరోసారి ఎసిబి అధికారులు కెటిఆర్ కు నోటీసులు ఇచ్చింది .మరోవైపు, ఇదే కేసులో ఇవాళ ఈడీ విచారణ పిలవగా.. తనకు సమయం కావాలని కెటిఆర్ కోరారు. దీంతో ఆయనకు కొంత సమయం ఇస్తున్నట్లు తెలిపింది





