హిడ్మాల్‌, శంక‌ర్‌ల‌ది ముమ్మాటికీ బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్లే

– ద్రోహుల స‌మాచారంతో ఆంధ్రా పోలీసులు చిత్ర‌హింస‌లు పెట్టి హ‌త్య‌
– ఇది కేంద్ర‌, ఆరు రాష్ట్రాల జాయింట్ ఆప‌రేష‌న్‌
– ఈ ఘ‌ట‌న‌పై న్యాయ విచార‌ణ చేప‌ట్టి దోషుల‌ను శిక్షించాలి
– ఆప‌రేష‌న్ క‌గార్‌ను వ్య‌తిరేకిస్తూ ఉద్య‌మించాలి
– కేంద్ర క‌మిటీ నేత‌లు దేవూజీ, సంగ్రామ్ క్షేమం..
– అరెస్టయిన 50 మంది స‌హ‌చ‌రుల‌కు న్యాయ సాయం చేయాలి
– దండ‌కార‌ణ్య స్పెష‌ల్ జోన‌ల్‌ క‌మిటీ మీడియా ప్ర‌తినిధి విక‌ల్ప్ ప్ర‌క‌ట‌న‌
 హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 4 : త‌మ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హిడ్మాల్ ను, ఆయనతో ఉన్న ఐదుగురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు న‌వంబ‌ర్ 15న‌ అరెస్టు చేసి మూ డు రోజుల పాటు తీవ్రంగా చిత్రహింసలు పెట్టి నవంబర్ 18న హత్య చేశార‌ని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకార ణ్య స్పెషల్ జోనల్ కమిటీ మీడియా ప్రతినిధి వికల్ప్ ఆరోపించారు. సుదీర్ఘమైన ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. కు ఆపరoషన్ కగార్, శుక్ర‌వారం ఆయ‌న మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. హిడ్మాల్ అక్టోబర్ 27న విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్లాడు. ఆ తర్వాత మరికొంత మంది వెళ్లారు. నిరాయుధంగా ఉన్న హిడ్మాల్ సహ ఆరుగురిని పట్టుకుని హత్య చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారెడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వారు చనిపోయారని పోలీసులు కట్టుకథను ప్రచా రం చేశారు. నవంబర్ 19న అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో ఏడుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్ లో చనిపోయా రని పోలీసులు ప్రకటించారు. నవంబర్ 19 నాటి ఘటనలో కూడా నిరాయుధులైన ఏఓబీ ఎస్.జెడ్.సీ. సభ్యుడు శంర్‌ను, మరో ఆరుగు రిని అరెస్టు చేసి బూటకపు ఎన్‌కౌంటర్ లో హత్య చేశారు. నవంబర్ 18, 19వ‌ తేదీల్లో శ త్రు సాయుధ బలగాలు చేసిన హత్యలో అసువులు బాసిన త‌మ నాయ‌కుల‌కు  దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తోంద‌ని దండ‌కార‌ణ్య స్పెష‌ల్ జోన్ క‌మిటీ  తెలిపింది. వారి ఆశయసాధన కోసం తుదిశ్వాస వరకు పోరాడతామని, వాళ్ల కుటుంబ సభ్యులకు, బంధు మిత్రులకు ప్రగాఢ మైన సంతాపాన్ని, సంవేదనను తెలియజేస్తోంద‌ని ప్ర‌క‌టించింది.
రెండు ఘటనల్లో కూడా వారిని బయటికి తీసుకెళ్లిన వ్యక్తులే పోలీసు ఇన్‌ఫార్మ‌ర్ల‌ని ఇప్పుడు అర్థమవుతోంది. నవంబర్ 9న మా బలగాల నుంచి కోసాల్ అనే కంపెనీ పార్టీ కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యాడు. ఈయనకు హిడ్మాల్ ప్రయాణ వివరాలు, ఆయన బయట ఉంటున్న విషయం తెలుసు. కోసాల్ పారిపోయిన వెంటనే హిడ్మాల్‌కు ఈ విషయాన్ని తెలియజేసి వెంటనే లోపలికి రమ్మని మా అనుచరులు తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న తర్వాత ఆయన తన టీంతో లోపలికి రావడానికి సిద్ధమయ్యాడు.  ఈ విషయాన్ని ఆయనను తీసుకెళ్లిన వ్యక్తులు పోలీసులకు తెలపడంతో, పోలీసులు హిడ్మాల్‌ను, ఆయనతో పాటు ఉన్న మిగతా ఐదుగురిని అరెస్టు చేసి, హత్య చేసి ఎన్‌కౌంటర్ కథ అల్లారు. అలాగే శంకర్ ను తీసుకెళ్లిన వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకేసారి హిడ్మాల్ టీమ్‌ను, శంకర్ టీమ్‌ను, అరెస్టు చేసి తీవ్రమైన చిత్రహింసలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హత్యచేశారు. ఈ రెండు ఘటనలకూ, విజయవాడ, ఎన్టీఆర్., కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాల్లోని 50 మంది మావోయిస్టుల అరెస్టులకు వాళ్లను తీసుకెళ్లిన విజయవాడకు చెందిన కలప వ్యాపారి- ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్ – సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ ఈ ముగ్గురే కారకులు. వాళ్లతో పాటు మా నుంచి పారిపోయి మా కామ్రేడ్స్ ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాల్ కూడా కారణమే అని ప్ర‌క‌న‌ట‌లో పేర్కొన్నారు.ఇది ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల జాయింట్ ఆప‌రేష‌న్కోసాల్ మా నుంచి పారిపోయిన తర్వాత హిడ్మాల్ లోపలికి రావడానికి సిద్ధమవుతుండడంతో పోలీసులు ఏకకాలంలో పట్టుకుని, 13 మందిని హత్య చేశారు. 50 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో దేవ్‌జీ గానీ, సంగ్రాం (మల్లా రాజిరెడ్డి) గానీ లేరు. వాళ్లు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. హిడ్మాల్ తదితరుల సమాచారం దేవ్‌జీ పోలీసులకు ఇవ్వలేదు. ఈ వాస్తవాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఇంటలిజెన్స్ ఏజెన్సీలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏజెన్సీలకు స్పష్టంగా తెలుసు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదు. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్. దీనంతటికి సూత్రధారి దేశ, విదేశీ కార్పొరేట్ల విశ్వసనీయ సేవకుడు, నరహంతకుడు, రక్తపిపాసి కేంద్ర హోంమంత్రి అమిత్ షానే.కుట్ర‌పూరితంగా దేవ్‌జీపై ఆరోప‌ణ‌లు

వాస్తవాలు ఇలా ఉండగా, హిడ్మాల్ అమరుడై ప్రజలంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసుల పట్ల తీవ్రమైన కోపంతో ఉండ‌గా, ఈ హత్యలకు కారకులైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, పోలీసులను ప్రశ్నించకుండా. ఈ హత్యలపై న్యాయవిచారణ జరిపించి, ద్రోహులను శిక్షించాలని డిమాండ్ చేయకుండా హిడ్మాల్ హత్యకు దేవ్ జీ కారణమని మాజీ ఎంఎల్ఎ మనీష్ కుంజాం, సోనిసోడీలు ఆరోపించడమంటే అది కుట్రపూరిత ప్రకటనే. హిడ్మాల్ సహ 50 మందిని సరెండర్ చేయిస్తానని దేవ్ జీ వీరందరిని ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లి హిడ్మాల్ ను చంపించాడు. 50 మందిని అరెస్టు చేయించాడు’ అని మనీష్ కుంజాం నవంబర్ 21న కుట్రపూరితంగా ప్రకటన చేశాడు.బీజేపీ , ఆర్ఎస్ఎస్ క‌నుస‌న్న‌ల్లోనే క‌గార్

దేశాన్ని ‘కార్పొరేట్ హిందూదేశం’గా మార్చడానికి, మార్చి 31, 2026 నాటికి మావోయిస్టు పార్టీని, విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు  బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు ఆర్ఎస్ఎస్-బీజేపీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కగార్ యుద్ధాన్ని సాగిస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీకి చెందిన కేంద్ర, వివిధ రాష్ట్రాల రాష్ట్ర కమిటీ సభ్యులను నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాడులు చేస్తున్నాయి. అరెస్టులు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మా పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు సహ అనేకమంది కేంద్ర, రాష్ట్రకమిటీ సభ్యులను హత్య చేశాయి. మిగిలిన నేత‌లు గణపతి, దేవ్ జీ, మిసిర్ బిస్రా, సంగ్రాం తదితర కేంద్ర, రాష్ట్రకమిటీ సభ్యులను నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం, ప‌లు రాష్టాలు సంయుక్తంగా మీడియా ద్వారా ప్రకటనలు చేస్తున్నాయి. దీనికి  మాజీ ఎంఎల్ఎ మనీష్ కుంజాం, సోనిసోడీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను టార్గెట్ చేయకుండా దేవ్ జీని టార్గెట్ చేయడమంటే అది భారీ కుట్రలో భాగమే.ఏడాదిగా పోలీసుల మార‌ణ‌హోమం

ఈ ఏడాది ఏప్రిల్ నుంచి దేశవ్యాప్తంగా ప్రజలు, కగార్ యుద్దాన్ని ఆపాలని, బస్తర్ లో జరుగుతున్న నరసంహారాన్ని ఆపాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులతో శాంతిచర్చలు చేయాలని ప్రచార ఆందోళనలు చేస్తున్నారు. అయితే  2024, మే 10 నాడు పిడియలో తునికాకు కూలీలను పోలీసులు హత్య చేసిన ఘటన అనంతరం బస్తర్ లో జరుగుతున్నవన్నీ నిజమైన ఎన్‌కౌంట‌ర్ల‌నేన‌ని ఈ ఏడాది మే నెలలో బస్తర్ టాకీస్ కిచ్చిన ఇంటర్వ్యూలో మనీష్ కుంజాం నిస్సిగ్గుగా అబద్దాలాడుతున్నాడు. బస్తర్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయుధ బలగాలు కగార్ పేరుతో చేస్తున్న ఆదివాసుల నరసంహారాన్ని సమర్థించాడు. 2024 మే తర్వాత ఇప్పటివరకు బస్తర్‌లో ఎన్నోచోట్ల కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు ఆదివాసీ గ్రామీణ ప్రజానీకాన్ని హత్య చేశాయి.. చేస్తున్నాయి. డిసెంబర్ 13న కలాజా-దోంద్రువేడ పరిసరాల్లో జరిగిన చుట్టివేత దాడిలో కార్తిక్, రమీలతో పాటు ఐదుగురు గ్రామస్థులను ఉద్దేశ్యపూర్వకంగా హత్యచేశాయి. ఫిబ్రవరిలో తోడ్క గ్రామ పరిసరాల్ని చుట్టివేసి (ఎన్ సర్కిల్ మెంట్) ఏడుగురు గ్రామస్థుల్ని, పార్టీ సభ్యుడు నీలకంఠ్ ను హత్యచేశాయి. మార్చి 31న ఇంద్రావతి ఏరియాలోని బేల్ నార్ గ్రామంలో నిరాయుధంగా ఉన్న ఎస్.జెడ్.సి. సభ్యురాలు చైతేను పట్టుకుని హత్య చేశాయి. ఆ తర్వాత అదే ఏరియాలో సుధీర్ తో పాటు, ఇద్దరు గ్రామీణ యువకులను పట్టుకుని హత్య చేశాయి. కార్పొరేటీకరణకు/దేశ, విదేశీ కార్పొరేట్లకు దళారీగా మారిన, ఇంటలిజెన్స్ ఏజెన్సీలతో చేతులు కలిపి బస్తర్ లో విప్లవోద్యమానికి వ్యతిరేకంగా మనీష్ కుంజాం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల్సిందిగా ప్రజలకు పిలుపునిచారు.సోనిసోడి వాస్త‌వాలు తెలుసుకోవాలి

ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని, ఇది హత్య అని సరిగానే ఖండించినప్పటికీ, దేవ్ జీ పోలీసులకు చిక్కి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి హిడ్మాల్ గురించిన సమాచారాన్ని పోలీసులకు అందించాడని సోనీసోడి ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామ‌ని విక‌ల్ప్ పేర్కొన్నారు. హిడ్మాల్ హత్య గురించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రజాసంఘాల వారి ద్వారా వాస్తవాలు సేకరించకుండా ఇలాంటి ప్రకటనలు చేయడం తీవ్ర అక్షేపణీయం. ఒకవేళ తను ప్రజాపక్షాన, ఆదివాసుల పక్షాన నిలబడాలనుకుంటే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలు తెలుసుకోకుండా తొందరపాటుతో ప్రకటన చేసానని చెప్పాల‌ని, ఈ ప్రకటనను ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు.హిడ్మా చ‌రిత్ర‌ను క‌ళంకితం చేసేందుకు దుష్ట ప్ర‌య‌త్నాలు

హిడ్మాల్ తదితర తమ పోలీస్ ఇన్ఫార్మర్ల వద్ద ఉన్నారని తెలిసి, వారిని హత్య చేయడానికి నిర్ణయించుకున్న తర్వాతనే ఛత్తీస్ గఢ్ ఉపముఖ్యమంత్రి విజయ్ శర్మ పువ్వర్తి గ్రామానికి వెళ్లాడు. అక్కడ హిడ్మాల్ తల్లితో ఆయన సరెండర్ కావాలని ప్రకటన ఇప్పించాడు. హిడ్మాల్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు సరెండర్ కాడనేది శత్రువుకు స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ ప్రకటన ఇప్పించాడు. సరెండర్ కావాలని కోరినప్పటికీ తను సరెండర్ కాలేదు కాబట్టి హిడ్మాల్ ను చంపాల్సి వొచ్చిందని, తాము చేసిన హత్యకాండను సమర్థించుకునే దుష్టపథకంలో భాగమే ఇది. మరోవైపు, హిడ్మాల్ శత్రువుకు సరెండర్ కావడానికి యత్నించడనేది ఆయన చరిత్రను కళంకితం చేసే దుష్టపథకంలో భాగమేన‌ని పేర్కొన్నారు.

దోషుల‌కు శిక్ష ప‌డేవ‌ర‌కు ప్రజా ఉద్య‌మాలు చేయాలి

హిడ్మాల్ (మారెడుమిల్లి), శంకర్‌ (రంపచోడవరం) హత్యకాండపై న్యాయవిచారణ జరిపించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, కగార్ యుద్ధాన్ని ఆపాలని దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాల్సిందిగా ప్రజలకు విక‌ల్ప్ త‌న ప్ర‌క‌ట‌న‌లో పిలుపునిచారు. విజయవాడ తదితర పట్టణాల్లో అరెస్టయిన 50 మంది త‌మ అనుచరుల‌కు న్యాయ సహాయం అందించాల్సిందిగా. వారి విడుదల కోసం కృషి చేయాల్సిందిగా ప్రజాపక్ష న్యాయవాదులకు, హక్కుల కార్యకర్తలను కోరారు.యుద్ధ తీవ్ర‌త‌తో ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌లేక‌పోతున్నాం

కగార్ యుద్ధానికి వ్యతిరేకంగా మా పార్టీ నాయకత్వంలో అమరుల ఆశయసాధన కోసం విప్లవోద్యమంలో దృఢంగా నిలబడి పోరాడడం మనందరి కర్తవ్యమ‌ని విక‌ల్ప్ పేర్కొన్నారు. కగార్ యుద్ద తీవ్రత రీత్యా మేం రెగులర్ గా ప్రకటనలు ఇవ్వలేని స్థితిలో ఉన్నామ‌ని పేర్కొన్నారు.  అందుకే మనీష్ కుంజాం లాంటి వారి అబద్దపు ప్రకటనలతో గందరగోళానికి, అవిశ్వాసానికి గురికావద్దు. సోను, సతీష్ లాంటి విప్లవ ద్రోహుల సరెండర్లతో, ఇతరుల సరెండర్లతో నిరాశపడవద్దు. పార్టీకి సంబంధించిన‌ ఏ విషయంపైన అయినా  గ్రామాల్లోకి వొచ్చే త‌మ పార్టీ కార్యకర్తల ద్వారా వాస్తవాల్ని తెలుసుకోవాలని, విప్లవోద్యమంలో దృఢంగా నిలబడాలని ప్రజలకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విక‌ల్ప్  విజ్ఞప్తి చేశారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *