– మూడు నుంచి ఐదు డిగ్రీలు తగ్గనున్న ఉష్ణోగ్రత
– కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
– హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక
తెలంగాణలో రానున్న ఐదురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవనాలు శనివారం కేరళను తాకాయి. రాబోయే రెండుమూడు రోజుల్లో తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఏపీ వరకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఈ నెల 27న పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఇక తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు నుంచి ఏడు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆయా జిల్లాకు ఎల్లో అలెర్ట్ని జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతాయని పేర్కొంది. 26న నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులతో వానలు పడతాయని చెప్పింది.
27న కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని చెప్పింది. 28న ఆదిలాబాద్, కుమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలెర్ట్ని జారీ చేసింది.





