– అనేక కాలనీల్లో మోకాలు లోతు నీళ్లు
– వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం
వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: వరంగల్ జిల్లాలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. వరంగల్ నగరంలో వర్షం దంచి కొట్టింది. వరంగల్ నగరంలోని వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, శివనగర్, ఎన్టీఆర్ నగర్ కాలనీల్లోకి వరద నీరు భారీగా చేరింది. భారీ వర్షానికి గోకుల్ నగర్, శాంతి నగర్, కాలనీలకు ముంపు ముప్పు పొంచి ఉంది. కరీమాబాద్, రంగశాయిపేట, కాశీబుగ్గ ప్రాంతాలు మోకాళ్ల లోతు వరద నీళ్లలో కూరుకుపోయాయి. సోమవారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన రహదారులపై నీరు చేరడంతో వరంగల్ నగరంలో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లు, షాపుల్లోకి వరద నీళ్లు రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. గడిచిన 12 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 92.9 మిల్లీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు
మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
విశాఖపట్టణం:మధ్య బంగాళాఖాంతంలో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. బుధవారం నాటికి ఇది అల్ప పీడనంగా బలపడే అవకాశం ఉంది. ఆరు రోజులపాటు ఏపీకి విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది.. నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. రేపు కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి.. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో గత 5-6 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీగా వానలతో దాదాపుగా అన్ని జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వరదలకు చెరువులు, జలాశయాలు నిండిపోయాయి. మరోవైపు రహదారులపై వరద చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. భారీ వర్షాలకు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ప్రయాణికులు గంటల పాటు ట్రాఫిక్లో చిక్కుకుపోతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షం పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం అయ్యారు. నగర వాసులకు ఓ సూచన చేశారు. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు. మధ్యాహ్నం 3 గంటల్లోగా ఇళ్లకు చేరుకునేలా ప్లాన్ చూసుకోవాలని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీని నివారించడానికి సాయంత్రం షిప్ట్ ఉన్నవారు ఇంటి నుంచే పని చేసేలా ప్లాన్ చేసుకోవాలని ఓ ప్రకటన రిలీజ్ చేశారు.




