విద్యార్థులకు నులి పురుగుల నిర్మూలన మాత్రల పంపిణీలో మంత్రి దామోదర
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 11: జాతీయ నులిపురుగుల నిర్మూలన దినాన్ని (deworming day) పురస్కరించుకొని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Minister Damodara) హైదరాబాద్ షేక్పేటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆల్బండజోల్ టాబ్లెట్స్ను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతోపాటు అంగన్వాడీలలో సుమారు 98 లక్షల మంది పిల్లలకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు పంపిణీ చేస్తున్నామన్నారు. పిల్లల ఆరోగ్య భద్రత ప్రభుత్వానిదని మంత్రి వెల్లడిరచారు. పిల్లలే జాతి సంపద అని, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు పిల్లలందరూ ఆల్బండజల్ టాబ్లెట్స్ను వేసుకోవాలని మంత్రి దామోదర సూచించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తదితరులు పాల్గొన్నారు.




