అసెంబ్లీలో హేట్‌ ‌స్పీచ్‌ ‌బిల్లు

-సెలెక్ట్ ‌కమిటీకి పంపిన స్పీకర్‌
-‌ బిల్లును వ్యతిరేకించిన బీజేపీ

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 30: అసెంబ్లీలో హేట్‌ ‌స్పీచ్‌ ‌బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్పీకర్‌ ఈ ‌బిల్లును సెలెక్ట్ ‌కమిటీకి సిఫార్సు చేశారు. ఈ బిల్లును గత సోమవారం మంత్రిమండలి ఆమోదించింది. ఈ బిల్లుతో ఇక విద్వేషపూరిత ప్రసంగాలకు చెక్‌ ‌పడనుంది. మతం, కులం, లింగం లేదా ఇతర కారణాల వల్ల సమాజంలో విద్వేషం, అశాంతిని రేకెత్తించే ప్రసంగాలు, రచనలు లేదా సోషల్ ‌మీడియా పోస్టులను అరికట్టడానికి ఉద్దేశించిన చట్టమే హేట్‌ ‌స్పీచ్‌ ‌బిల్లు. ఇటువంటి చర్యలకు పాల్పడేవారిపై కఠినమైన జరిమానాలు, 7 ఏళ్ల వరకు జైలు శిక్షలు విధించడం, ఈ నేరాలను నాన్‌-‌బెయిలబుల్‌గా పరిగణించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. విద్వేష పూరిత ప్రసంగాలు మొదటి సారి రుజువు అయితే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. శిక్షతోపాటు రూ. 50 వేలు జరిమానా విధిస్తారు. ఇదే ఘటన మరోసారి పునరావృతమైతే జైలు శిక్ష పదేళ్లు, రూ. లక్ష జరిమానా విధిస్తారు. ఇటీవల కాలంలో సోషల్ ‌మీడియాలో విద్వేష పూరిత ప్రకటనలు, ప్రసంగాలు సైతం పెరిగాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇకపై సంఘం, సమూహం, సమావేశాల్లో ద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు ఉండొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. మతం, జాతి, కులం, వర్గం, స్త్రీ, పురుష, లైంగిక, జన్మస్థలం, నివాసం, భాష, అశక్తత, తెగలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు, ప్రసంగాలు ఉండొద్దని ఈ బిల్లును తీసుకొచ్చింది. మాటల ముద్రణ, ప్రచురణ, ఎలక్టాన్రిక్‌ ‌మాధ్యమం/సాధనాల ద్వారా సమాచార మార్పిడి ఉన్నా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ బిల్లు ద్వారా ఎలాంటి అసభ్యకర కంటెంట్‌, ‌సందేశం, సమాచారం ఉంటే వాటిని తొలగించాలని ఎలక్ట్రానిక్ ‌మీడియాతో పాటు సర్వీస్‌ ‌ప్రొవైడర్లను హెచ్చరించే అధికారం అధికారులకు ఉంటుంది. ఇక మీద సోషల్‌ ‌మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడినా, రెచ్చగొట్టే పోస్టులు చేసినా జైలు శిక్ష తప్పదు.

బిల్లు అత్యంత ప్రమాదకరం : బిజెపి ఎమ్మెల్యే ఏలేటి 

ఈ బిల్లు అత్యంత ప్రమాదకరమని బిజెపి ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ ‌రెడ్డి తెలిపారు. రాజకీయ కక్షసాధింపులకే హేట్‌ ‌స్పీచ్‌ ‌బిల్లు అన్నారు. అసెంబ్లీలో హేట్‌ ‌స్పీచ్‌ ‌ప్రివెన్షన్‌ ‌బిల్లును సెలక్ట్ ‌కమిటీకి స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌రిఫర్‌ ‌చేశారు. ఈ సందర్భంగా ఏలేటి మాట్లాడుతూ ఆధారాలు లేకున్నా అరెస్ట్ ‌చేసేలా బిల్లు ఉందని, చట్టాలు ప్రజల రక్షణ కోసం ఉండాలి.. ప్రజల గొంతు నొక్కడానికి కాదని విమర్శించారు. ఇలాంటి చట్టం చేసేముందు హౌస్‌ ‌కమిటీ వేయాలని, చర్చ జ‌ర‌గాలని డిమాండ్‌ ‌చేశారు. సెక్షన్‌ 4 అనేది ప్రజాస్వామ్యానికి డెత్‌ ‌వారెంట్‌ అని,హేట్‌ ‌స్పీచ్‌ ‌బిల్లును వ్యతిరేకిస్తున్నామని తెలియజేశారు.

ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకే .. : కేటీఆర్ ధ్వజం

తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లుపై బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే ఒక క్రూరమైన ఆయుధంగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వం తన విమర్శకుల నోళ్లు మూయించేందుకే ఇటువంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతే అయినప్పటికీ, ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని ఆయన విమర్శించారు. అమలు యంత్రాంగం ఆధారాల కంటే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా ఈ బిల్లు రూపకల్పన జరిగింది. ఇది కచ్చితంగా దుర్వినియోగానికి దారితీస్తుంది అని పేర్కొన్నారు. బిల్లులో ఉపయోగించిన ‘వ్యతిరేక భావాలు ప్రేరేపించడం’, ‘సామాజిక సమగ్రతను దెబ్బతీయడం’ వంటి పదాలకు స్పష్టమైన న్యాయ పరిమితులు లేవని కేటీఆర్ ఎత్తిచూపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ పదజాలాన్ని పొందుపరిచారని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శిస్తే వాటిని ఫేక్ న్యూస్ గా ముద్ర వేసి జైలుకు పంపే ప్రమాదం పొంచి ఉందన్నారు. ‘శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు. కేవలం ప్రత్యక్ష హింసకు ప్రేరేపించే మాటలపైనే నియంత్రణ ఉండాలని, విమర్శ లేదా వ్యంగ్యం శిక్షార్హం కాదని కోర్టు స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. ఈ పరిమితిని మించి చట్టాలు చేయడం ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేశారు. ఏడు నుంచి పది సంవత్సరాల వరకు జైలు శిక్షలను ప్రతిపాదించడం ద్వారా ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించాలని ప్రభుత్వం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో హేట్ స్పీచ్‌పై తగినన్ని చట్టాలు ఉండగా అదనంగా ఈ చట్టం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. వెంటనే ఈ బిల్లును పునఃపరిశీంచాలని,  ప్రజాస్వామ్య విలువలను గౌరవిస్తూ అణచివేత ధోరణిని వీడాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *