రిజిస్ట్రేషన్ల ఆదాయంపై హరీష్‌ అసత్య ప్రచారం

– వచ్చిన ఆదాయం నుంచి ‘స్థానిక’ వాటా సర్దుబాటు
– అసెంబ్లీ వాయిదా సమయంలోనూ ప్రజాసేవలోనే ఉన్నాం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టీకరణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: రాష్ట్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం తగ్గిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీని, రాష్ట్ర ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని, ఆయన చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు రూ.14,250 కోట్ల ఆదాయం సమకూరిందని, ఈ ఆదాయం నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వాటాగా రూ.5,740 కోట్లను ప్రభుత్వం సర్దుబాటు (అడ్జస్ట్) చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం 2020 నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చిన ఆదాయాన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీ చేయకుండా కాలయాపన చేసి ఆ నిధులను మొత్తంగా స్టాంప్ డ్యూటీ ఆదాయంగానే తప్పుడు లెక్కలు చెప్పిందని విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పును పునరావృతం చేయకూడదని, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయరాదనే ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల ఆదాయం నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులను కేటాయించిందన్నారు. అసెంబ్లీని టీ బ్రేక్ పేరుతో రెండున్నర గంటలపాటు వాయిదా వేశామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన విమర్శల్లో అర్థం లేదన్నారు. సభ వాయిదా పడినప్పటికీ తాము ఎక్కడికీ వెళ్ళలేదని, అసెంబ్లీ ప్రాంగణంలోనే ఉండి విధులను నిర్వర్తించామని చెప్పారు. ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలు, ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాల కోసం ఈ బడ్జెట్‌లో రూ.1.20 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని, సింగరేణి, విద్యుత్ సంస్థల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన ఈ పథకం కింద తాజాగా ఎస్పీడీసీఎల్ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అసిస్టెంట్ లైన్‌మన్ ఓర్సు సురేష్, మహబూబ్‌నగర్‌కు చెందిన ముక్తార్ బేగ్ కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశామని వివరించారు. ఉద్యోగులకు నమ్మకాన్ని, భరోసాను కల్పించేందుకే ఈ కార్యక్రమాన్ని అసెంబ్లీ హాల్‌లోనే నిర్వహించామన్నారు. సభ వాయిదా పడిన సమయంలోనూ తాము బాధ్యతాయుతమైన పనుల్లోనే ఉన్నామన్న విషయాన్ని విపక్ష సభ్యులు గమనించాలన్నారు.

అసైన్డ్ భూములను పార్ట్- బిలో పెట్టి హింసించారు
ధరణి పోర్టల్ పేరుతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములను పార్ట్-బి జాబితాలో చేర్చి పదేళ్లపాటు వారిని హింసించిందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. అసెంబ్లీ సమావేశాల్లో అసైన్డ్ భూముల అంశంపై హరీష్ రావు మాట్లాడుతున్న క్రమంలో ఆయన జోక్యం చేసుకుని ఘాటుగా స్పందించారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు తాను చేపట్టిన పాదయాత్రలో ప్రతి గ్రామంలోనూ అసైన్డ్ రైతులు తమ భూములకు హక్కులు లేక పడుతున్న గోడును స్వయంగా విన్నానని గుర్తు చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెట్టి చాకిరి నుంచి విముక్తి పొందిన వారికి సాగు, ఇళ్ల నిర్మాణం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములను కూడా ధరణి నిషేధిత జాబితాలో చేర్చడం దుర్మార్గమని విమర్శించారు. తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ధరణిని బంగాళాఖాతంలో వేసి పారదర్శకమైన ‘భూభారతి’ వ్యవస్థను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. భూ సంస్కరణల ద్వారా పేదలకు అందిన భూములకు భూభారతి ద్వారా పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అసైన్డ్ భూములను ఆక్రమించుకుని, పేద రైతులను ఇబ్బందులకు గురిచేసిన వారే ఇప్పుడు భూముల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని హరీష్రావునుద్దేశించి భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
——————————————————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *