– ప్రేమించి పెళ్లి చేసుకుని కట్నం కోసం వేధింపులు
వికారాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లాడిన వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం చిత్రవధలకు గురిచేశాడు. చివరకు విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. తాజాగా ఈ కిరాతకానికి సంబంధించిన వీడియో బయటకొచ్చింది. పట్టణంలోని సాయిపూర్కు చెందిన పరమేశ్, అనూష (22) ప్రేమించుకున్నారు. పరమేశ్ పట్టుబట్టడంతో అతని తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే, 8 నెలల క్రితం పెళ్లి జరిపించారు. ప్రేమించి పెళ్లాడిన వ్యక్తితో సంతోషంగా గడపొచ్చని భర్తతో మెట్టింటికి అడుగుపెట్టిన అనూషకు నిరాశే ఎదురైంది. అత్తమామలతోపాటు భర్త నుంచి వరకట్న వేధింపులు మొదలయ్యాయి. కొద్దిరోజులుగా కట్నం కోసం వారు వేధింపులకు గురిచేశారు. వారం క్రితం విచక్షణారహితంగా కొట్టారు. విషయం తెలిసిన అనూష తల్లి, సోదరుడి వరసయ్యే వ్యక్తి వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. అయితే అనూషను మంచిగా చూసుకుంటానని చెప్పిన పరమేశ్ గురువారం ఆమెను తీసుకుని వెళ్లాడు. తర్వాత మరోసారి అనూషతో గొడవపడి తీవ్రంగా కొట్టాడు. దీంతో అనూష అపస్మారక స్థితిలోకి చేరుకుంది. గమనించిన స్థానికులు హాస్పిటల్కి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనూషను పరమేశ్ ఇంటి బయట కొట్టడం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





