-ప్రభుత్వానికి కె.టి.ఆర్. లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 23: సిరిసిల్లలోని పవర్ లూమ్ కార్మికులు(handloom weavers) ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం సుకోవాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు (KTR) డిమాండ్ చేశారు. పవర్ లూమ్ కార్మికులపై పడుతున్న రూ. 35.48 కోట్ల బ్యాక్ బిల్లింగ్ బకాయిలను మాఫీ చేసి, వారికి రావాల్సిన రూ. 101.77 కోట్ల విద్యుత్ సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క కు సుదీర్ఘ లేఖ రాశారు. కుటీర పరిశ్రమల కేటగిరీ కింద 50% విద్యుత్ టారిఫ్ సబ్సిడీ పొందుతున్న యూనిట్లు, అవగాహన లోపంతో ఎస్ఎస్ఐ యూనిట్లుగా మారడంతో ఇండస్ట్రీ-3 కేటగిరీ కిందకు వచ్చాయని కేటీఆర్ వివరించారు. ఈ క్రమంలో హైకోర్టు ఆదేశాల మేరకు 127 ఎస్ఎస్ఐ యూనిట్లకు, అలాగే 191 ఇతర యూనిట్లకు మొత్తం రూ. 35.48 కోట్లు బ్యాక్ బిల్లింగ్ బకాయిలు పడ్డాయని తెలిపారు. ఈ భారీ మొత్తాన్ని చెల్లించే స్థితిలో కార్మికులు లేరని, ఫలితంగా వారికి పవర్ లూమ్స్ నడపడం కష్టంగా మారిందన్నారు. పవర్ లూమ్స్కు ప్రభుత్వం నుండి రావాల్సిన రూ. 101.77 కోట్ల సబ్సిడీ విడుదల కాకపోవడంతో, సిరిసిల్ల కో-ఆపరేటివ్ ఎలక్ట్రిక్ సప్లై సొసైటీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని కేటీఆర్ తెలిపారు. టీజీఎన్పీడీసీఎల్కు చెల్లించాల్సిన విద్యుత్ కొనుగోలు ఖర్చులను కూడా చెల్లించలేకపోతున్నదని వివరించారు. నేత కార్మికులను ఆదుకోవడానికి, వారి జీవనోపాధిని కాపాడటానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని కేటీఆర్ కోరారు. బకాయిలను మాఫీ చేసి, సబ్సిడీలను విడుదల చేసి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్ వీడియోల కోసం Prajatantra వెబ్సైట్ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





ఈ ఫలితాలు ముమ్మాటికీ రెఫరెండమే