– అయిన వారి కోసం కార్మికుల పొట్ట కొడతారా?
– ప్రభుత్వ తీరుపై జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత కార్మికుల పొట్టకొడుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. చేనేత కార్మికులకు ఇచ్చిన విద్యార్థుల యూనిఫాంల ఆర్డర్ను ఏకపక్షంగా రద్దు చేయడంపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాల్సిన వారికి మేలు చేసేందుకే కార్మికులకు అన్యాయం చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఏటా సుమారు రూ.105 కోట్ల యూనిఫాంల ఆర్డర్ ఇచ్చేవారని.. ఇప్పుడు దాని రద్దుతో వేలాది మందికి ఉపాధి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేతల ఉపాధి సంక్షోభంలో పడిందని కవిత ధ్వజమెత్తారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 393 చేనేత సహకార సంఘాలపై తీవ్ర ప్రభావం చూపనుందని.. కార్మికులు వీధిన పడే దుస్థితి వచ్చిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ శాఖలకు చెందిన దుప్పట్లు, దుస్తులకు సంబంధించి రూ.200 కోట్ల ఆర్డర్లను కూడా తెలంగాణ చేనేతలకు ఇవ్వలేదని ఆరోపణలు గుప్పించారు. ఆర్డర్లు ఇవ్వకుండా సంస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు కవిత. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే కార్మికులతో కలిసి పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని కవిత హెచ్చరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.