– అమెరికా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం
వాషింగ్టన్, జనవరి 10: అమెరికా ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వీసాల ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజులు పెంచినట్టు పౌరసత్వ, వలస సేవల శాఖ తాజాగా వెల్లడించింది. కొత్త రేట్స్ మార్చ్ 1 నుంచి అమల్లోకి వొస్తాయని తెలిపింది. హెచ్-1బీ, ఎల్-1 సహా పలు రకాల వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ను వేగవంతం చేసేందుకు అమెరికా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును చార్జ్ చేస్తుంటుంది. హెచ్-1బీ లాంటి వీసాల విషయంలో గతంలో 2,805 డాలర్లుగా ఉన్న ప్రీమియం ఫీజు ప్రస్తుతం 2,965కి పెరిగింది. విదేశీ ఉద్యోగుల వీసా దరఖాస్తు పరిశీలనను వేగవంతం చేసేందుకు అమెరికా సంస్థలు ఈ ఫీజును చెల్లిస్తుంటాయి. ఇక ఎఫ్-1, జే-1వంటి వీసాల ప్రీమియం ఫీజు కూడా 1,965 డాలర్ల నుంచి 2,075 డాలర్లకు పెరిగింది. 2023 జూన్ నుంచి 2025 జూన్ మధ్య కాలంలో పెరిగిన ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ప్రీమియం ప్రాసెసింగ్ ఫీజును పెంచినట్టు పౌరసత్వ, వలస సేవల శాఖ పేర్కొంది. జాబ్స్ మారే వారు, వీసాలను రెన్యూవల్ చేసుకునే విదేశస్తులపై ఈ పెంపు భారం పడనుంది. ఫీజు పెంపుతో వచ్చే అదనపు నిధులతో తమ కార్యకలాపాలను మరింత సరళతరం చేసేందుకు వినియోగిస్తామని ప్రభుత్వం తెలిపింది. వీసా దరఖాస్తుల బ్యాక్లాగ్స్ తగ్గడంతో పాటు వీసా దరఖాస్తుల పరిశీలన ఇతర సేవలు మరింత వేగవంతం అవుతాయని చెప్పింది. వీసా సేవలకు పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా ధరలు సరిదిద్దడమే తమ లక్ష్యమని కూడా వెల్లడించింది. వలసల కట్టడికి ఇప్పటికే అమెరికా ప్రభుత్వం వివిధ మార్గాలను అనుసరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే చిక్కులు తప్పవని ఇటీవల భారతీయ ఎంబసీ ఎక్స్ వేదికగా హెచ్చరించిన విషయం తెలిసిందే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





