– కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
– జీఎస్టీ- సామాజిక న్యాయం’ గ్రంథావిష్కరణ
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16 : దేశానికి ఆయువుపట్టు జీఎస్టీ సంస్కరణలు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై లోతైన అధ్యయనంతో రచించిన సామాజిక న్యాయం- ఆర్థిక సమానత్వం- అభివృద్ధి దిశగా జీఎస్టీ అనేగ్రంథాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లోని తన చాంబర్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా. కె.లక్ష్మణ్, గ్రంథ రచయిత, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహనరావులతో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ వివక్ష రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్రం జీఎస్టీ సంస్కరణలను తీసుకువచ్చిందని స్పష్టం చేశారు. ఈ సంస్కరణలు సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాల వైపు ఎలా దోహదపడుతున్నాయో ఈ గ్రంథంలో స్పష్టంగా వివరించారని, ఈ రచన అత్యంత ప్రామాణికమైనదని ప్రశంసించారు. ఈ సంస్కరణలను సామాజిక న్యాయం, సంక్షేమం, అభివృద్ధి కోణాల్లో సమగ్రంగా విశ్లేషిస్తూ రచయిత డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహనరావు ఈ గ్రంథాన్ని నిబద్ధతతో రూపొందించారని ఆమె కొనియాడారు. ఇలాంటి పరిశోధనాత్మక గ్రంథాలు మరిన్ని వెలువడాలని ఆమె ఆకాంక్షించారు. ఈ గ్రంథం ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాలను సాధికారికంగా ఈ గ్రంథంలో డా. వకుళాభరణం విశ్లేషించారన్నారు. జీఎస్టీ పన్ను తగ్గింపులకే పరిమితం కాక ప్రజల జీవన ప్రమాణాలను శాశ్వతంగా పెంచే దిశగా అమలులోకి తీసుకువచ్చిన గొప్ప సంస్కరణలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆశయాలను అందరికీ అర్థమయ్యే రీతిలో ఈ గ్రంథం ద్వారా ప్రజల ముందుకు తీసుకురావడం డాక్టర్. వకుళాభరణం నిబద్ధతకు నిదర్శనమన్నారు. దశలవారీగా అనేక సంస్కరణలు అమలవుతున్నాయని, వాటిలో జీఎస్టీ సంస్కరణలు అత్యంత కీలకమైనవని తెలిపారు. గ్రంథ రచయిత డాక్టర్ కృష్ణమోహనరావు మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా చేతుల మీదుగా తన గ్రంథం ఆవిష్కరణ జరగడం తనకు గర్వకారణమన్నారు. తన నిరంతర కృషికి సముచితమైన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. గ్రంథ ఆవిష్కరణకు సహకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


