-పదేళ్లుగా గ్రూప్-1 నియామకాలు లేవు
– సమస్యలు ఎదుర్కొని నియామక ప్రతాలు అందించాం
– సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: విద్యార్థి, నిరుద్యోగ యువత ఆత్మబలిదానాలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో పదేళ్లు అధికారం చెలాయించిన వాళ్లు ఒక్కక్షణం కూడా నిరుద్యోగుల గురించి ఆలోచన చేయలేదన్నారు. గ్రూప్-2 ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో శనివారం ఆయన ప్రసంగించారు. అమరుల ఆశయ సాధనపై వాళ్లు ఆలోచన చేసి ఉంటే మీకు ఎనిమిదేళ్ల క్రితమే ఉద్యోగాలు వచ్చేవి. వాళ్ల కుటుంబంలో పదవులు భర్తీ చేసుకున్నారు తప్ప గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. పదిహేనేళ్లుగా గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ జరగలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మేం గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశాం. గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి ఇవాళ నియామక పత్రాలను అందిస్తున్నామన్నారు. మిమ్మల్ని తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేసే బాధ్యత టీజీపీఎస్సీ తీసుకుందన్నారు. మీరు, మేము వేరు కాదు.. మీరే మేము.. మేమే మీరన్నారు. చీకటి రోజులు పోవాలి.. నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలని గ్రూప్-1 విషయంలో సమస్యలన్నింటినీ ఎదుర్కొని నియామక పత్రాలు అందజేశామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గుర్తుచేశారు. గత పాలకులు ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు కేసులు వేసి అక్రమ సంపాదనతో ఏర్పాటు చేసుకున్న సోషల్ మీడియా వ్యవస్థతో మాపై బురద జల్లే ప్రయత్నం చేశారన్నారు. అలాంటి ఏ వ్యవస్థ మాకు లేదు.. మా వ్యవస్థనే మీరు.. ఆ వ్యవస్థలో మీరే మా కుటుంబ సభ్యులన్నారు. ఇప్పటివరకు మీరు సామాన్యులు.. ఈ రోజు నుంచి మీరు ఆఫీసర్స్. మీ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహించి రైజింగ్ తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేయాలన్నారు. దేశంలోనే తెలంగాణను అభివృద్ధిలో ఆదర్శంగా నిలపాలన్నారు. రక్తం చెమటగా మార్చి మిమ్మల్ని ఇంతవాళ్లను చేసిన తల్లిదండ్రులను మరిచిపోవద్దన్నారు. నిస్సహాయులకు సహాయం చేయండి.. పేదలకు అండగా నిలవండి అని పిలుపునిచ్చారు. గత పాలకుల పాపాల పుట్ట పగులుతోంది. వాళ్ల దోపిడీ గురించి మేం చెప్పడం కాదు.. వాళ్ల కుటుంబ సభ్యులే చెబుతున్నారన్నారు. హాస్టల్స్ లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే వాళ్లు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. సెంటిమెంట్ తో మళ్లీ అధికారంలోకి రావాలనుకుంటున్నారన్నారని, అలాంటి వారి పట్ల మీరు జాగ్రత్తగ ఉండాలని హెచ్చరించారు. ఎలాంటి ప్రమాద ఘటనలు జరగకుండా, ఫుడ్ పాయిజన్ తో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా చూడాలని, సమర్ధవంతంగా పనిచేసి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.