– 2లక్షల ఉద్యోగాల హాని విస్మరించిన రేవంత్
– అశోక్ నగర్ చౌరస్తాలో రాహుల్ ఏం మాట్లాడారు
– నిరుద్యోగుల పక్షాన అసెంబ్లీలో పోరాడుతాం
– నిరుద్యోగ మేలాలో ఎమ్మెల్యే హరీష్ రావు
సిద్ధిపేట, ప్రజాతంత్ర,సెప్టెంబరు 13: గ్రూప్ -1 పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిండని విమర్శించారు. రాహుల్ గాంధీని అశోక్ నగర్ లో కూర్చోబెట్టి హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని, అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని.. కు న్యాయం జరిగే వరకూ కృషి చేస్తామని హామీ ఇఛ్చారు. సిద్దిపేటలో మెగా జాబ్ మేలా కార్యక్రమానికి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్ -1 లో ఉద్యోగానికి మంత్రులు, అధికారులు నిరుద్యోగుల వద్ద లంచం అడిగారని చెబుతున్నారని మండిపడ్డారు. తప్పును సరిదిద్దుకోకుండా అప్పీల్కి వెళ్లాలని ప్రభుత్వం భావించడం సిగ్గుచేటన్నారు. పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చుని హరీష్ పేర్కొన్నారు. చాలామందికి ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుండు అని అనుకుంటారు.. తప్పులేదు.. కానీ జీవితంలో మొదటి అడుగు పడడం అనేది చాలా ముఖ్యమని పేర్కొన్నారు. సిద్దిపేట దాటి హైదరాబాదులో ఉద్యోగం చేస్తేనే అనుభవం వస్తుంది.. ఉద్యోగం కోసం మీరు ఊరుదాటి వెళితే ప్రపంచం అర్ధమవుతుంది. పోటీ ప్రపంచంలో నువ్వెక్కడున్నావు, ఎక్కడ నిలబడ్డావు, ముందుకు సాగాలంటే ఏం చేయాలనే విషయాలతో ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. కష్టం విలువ, డబ్బు విలువ తెలుస్తుందని హరీశ్ తెలిపారు. ఉన్నత ఉద్యోగానికి, ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తూ ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోండని యువతకు సూచించారు. రాష్ట్రంలో ఈరోజు ఏం జరుగుతుందో మీకు తెలవనిది కాదు.. గ్రూప్-1 ఎగ్జామ్ పెడితే నిరుద్యోగులు వారి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. లక్షల రూపాయలు ఫలాన మంత్రులు, ఫలాన అధికారులు లంచం అడిగారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా అని స్వయంగా హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసింది. నిజంగా తప్పు చేయకపోతే ముఖ్యమంత్రి సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. అవినీతికి పాల్పడ్డ వారిని శిక్షించాలి. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామన్నారు. రెండేళ్లు పూర్తకావస్తున్నాయి. ఉద్యోగాలు ఏమయ్యాయి రేవంత్ రెడ్డీ అని ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్ వేసింది కేసీఆర్.. పరీక్ష నిర్వహించింది కేసీఆర్.. ఇంటర్వ్యూ నిర్వహించింది కేసీఆర్.. కేవలం ఉద్యోగ పత్రాలు ఇచ్చింది మాత్రం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే చర్చ పెట్టకుండా ఒక అంశాన్ని బట్టి జాబ్ క్యాలెండర్ అని పారిపోయారు. జాబ్ క్యాలెండర్ కాదు అది జాబ్ లెస్ క్యాలెండర్.. ప్రియాంక గాంధీతో హుస్నాబాద్ సభలో చెప్పించారు.. నిరుద్యోగ యువతకు నాలుగువేల నిరుద్యోగ భృతి ఇస్తామని. ఏమైంది.? ప్రభుత్వం నిరుద్యోగ యువతని పూర్తిగా మోసం చేసింది. పక్షాన మేము పోరాటం చేసి అసెంబ్లీలో ప్రశ్నిస్తాము. న్యాయం జరిగే వరకూ కృషి చేస్తామని హరీష్ అన్నారు. వెటర్నరీ కాలేజ్ని సిద్దిపేటలో పెడితే రేవంత్ రెడ్డి కొడంగల్ కి తరలించారు. సిద్దిపేటకు అన్యాయం చేశారు. వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి కట్టించాము. 90శాతం పని పూర్తయింది. ఆ చిన్న పనిని కూడా చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. ఈ ప్రభుత్వం పాజిటివ్ డైరెక్షన్ కంటే నెగటివ్ డైరెక్షన్లో వెళ్తుందని హరీష్ పేర్కొన్నారు. మరిన్ని జాబ్ మేళాలు కోసం ఏర్పాటు చేస్తామని యువతకు భరోసా కల్పించారు. మొన్న నేను లండన్ కి వెళ్ళినప్పుడు కూడా మన ఐటీ టవర్లో కంపెనీలు ఏర్పాటు చేయాలని అక్కడ ఉన్న తెలంగాణ బిడ్డలను కోరడం జరిగింది. ఈసారి ఎంతమందికి అవకాశం వస్తే అంతమంది ఉద్యోగాల్లో చేరాలని కోరుతున్నాను. దాదాపు 30 కంపెనీలు మీకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఇక్కడికి వొచ్చాయి. ఆలోచన సిద్దిపేట నుండి హైదరాబాద్కి పరిమితం కావద్దు. ముంబై కో, దిల్లీ అక్కడి నుండి ప్రపంచవైపుకు సాగాలి. ఇతర దేశాల్లో మన దగ్గర నుంచి వెళ్లిన పిల్లలు చదువుతూ చిన్న ఉద్యోగం అయినా చేస్తూ వారి కలలను సకారం చేసుకుంటారు. ఇక్కడ మనమూ ఈ జాబ్ చేయాల అంటే చిన్న ఉద్యోగం చేయాలనే అనుకుంటాం కానీ అక్కడ ఉద్యోగం చేయడమే గౌరవంగా భావించి చిన్నదైనా, పెద్దదైన చేస్తూ వారి లక్ష్యాన్నిసాధిస్తారు. మీరు కూడా మొదటి అడుగు వేయండని హరీష్ యువతకు మార్గదర్శనం చేశారు.
——————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





