– గ‌త ప్ర‌భుత్వం కేంద్రం నుంచి ఒక్క ఇల్లూ తీసుకోలేదు
-పేదింటి క‌ల నెర‌వేర్చ‌డ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం
-కేంద్ర‌ మంత్రి శివ‌రాజ్‌సింగ్ కు మంత్రి పొంగులేటి విజ్ఞ‌ప్తి

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 21: తెలంగాణ  ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా  2014-23 వరకు దాదాపు ప‌ది సంవ‌త్స‌రాల‌లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పేద‌ల ఇండ్ల నిర్మాణం జ‌ర‌గలేదు.  దీంతో  ఇండ్ల నిర్మాణానికి ప్ర‌జ‌ల నుంచి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రానికి అవ‌స‌ర‌మైన ఇండ్ల‌ను మంజూరు చేయాల‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌ రెడ్డి  కేంద్ర‌ ప్ర‌భుత్వానికి విజ్ఞ‌ప్తి చేశారు. పేదల సంక్షేమాన్ని విస్మరించిన ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలల్లో కేంద్రం నుండి ఒక ఇల్లు కూడా తీసుకోలేదు.  కానీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  సూచనల మేరకు గ్రామీణ  ప్రాంతాలకు ఇండ్లు మంజురు చేయాలని గడిచిన రెండు సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తి చేస్తూనే ఉన్నామ‌న్నారు.  కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు.  కనీసం ఈ ఆర్థిక సంవత్సరంలోనైనా గ్రామీణ ప్రాంతాలకు 3 లక్షల ఇండ్లు మంజురు చేయాలని కేంద్రాన్ని కోరారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా శనివారం హైదరాబాద్ లో మంత్రి పొంగులేటి ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గృహ నిర్మాణానికి సంబంధించి ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు. వ‌చ్చే మూడేళ్ల‌లో రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్మించాల‌ని త‌మ ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని, ఇప్పటికే ఈ ఏడాది దాదాపు నాలుగు లక్షల ఇందిరమ్మ ఇండ్లను చేశామ‌ని, కేంద్రం చేయూతనిస్తే ఈ కార్యక్రమం మరింత వేగవంతం అవుతుంద‌ని పేర్కొన్నారు.

రాష్ట్రం గతంలో పీఎంఏజీ-1.0లో భాగస్వామ్యం కాలేదు. అయితే 2023 తరువాత మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఎంఓఆర్‌డీ) మార్గదర్శకాల ప్రకారం పీఎంఏజీ-2.0లో రాష్ట్రం అధికారికంగా చేరింద‌న్నారు. 2024 ఆగస్టులో కేంద్ర మంత్రివర్గం పీఎంఏజీ- 2.0కు ఆమోదం తెలిపి ఆవాస్+2018 సర్వే నవీకరణ తర్వాత సాచురేషన్ పద్ధతిలో గృహాల మంజూరు చేయాలని నిర్ణయించినప్పటికీ పాత డేటా ఆధారంగా 2024-25, 2025-26 సంవత్సరాలకు ఇతర రాష్ట్రాలకు 1.19 కోట్ల గృహాలను కేటాయించింది. తెలంగాణ పీఎంఏజీ- 1.0 లో భాగస్వామ్యం కాకపోవడంతో 2018 పెండింగ్ డాటా లేదని పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ విస్తృత సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారుల డేటాబేస్‌ను సిద్ధం చేసుకుంది. అయినప్పటికీ కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ఆవాస్~2024 మొబైల్ యాప్ ద్వారా మరోసారి సర్వే నిర్వహించి మొత్తం 11.57 లక్షల అర్హులైన గ్రామీణ కుటుంబాలను గుర్తించామ‌న్నారు. రాష్ట్రంలో గత 12 ఏళ్లలో ఏర్పడిన పెండింగ్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని పరిస్థితులను అర్థం చేసుకొని ఈ ఆర్థిక సంవత్సరంలో 3 లక్షలు, వచ్చే ఏడాది మరో రెండు లక్షల ఇండ్లను మజూరు చేయాలని మంత్రి పొంగులేటి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. పేద కుటుంబాలకు సురక్షితమైన, గౌరవప్రదమైన నివాసాన్ని కల్పించడం ప్రభుత్వ ధ్యేయమని, పేదలకు సొంతింటి కల నెరవేర్చడం ప్రధాన సంకల్పమని, ఈ లక్ష్య సాధనలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని మంత్రి పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు.

——————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.