– ఓటేయడానికి వెళ్లే ఉద్యోగులకు ప్రత్యేక సెలవు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4: ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే ప్రజాస్వామ్య పండుగలో ఓటర్లు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు ఆయా రాష్ట్రాలకు చెందిన వారై ఉండి తెలంగాణలో నివసిస్తున్న ఓటర్ల కోసం ప్రత్యేక సెలవులను ప్రకటించింది. ఈ మేరకు కార్మిక, ఉపాధి శాఖ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. ఎన్నికలు జరుగుతున్న అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన ఓటర్లు ఎవరైతే తెలంగాణలో ఉద్యోగ రీత్యా లేదా ఇతర పనుల నిమిత్తం స్థిరపడ్డారో వారందరికీ తమ సొంత రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ సెలవు కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రైవేట్ రంగాలకు కూడా వర్తిస్తుంది. రాష్ట్రంలోని అన్ని రకాల ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, ఇతర సంస్థలలో పనిచేస్తున్న అర్హులైన కార్మికులకు, ఉద్యోగులకు పోలింగ్ రోజున పెయిడ్ హాలిడే ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓటు వేయడానికి వెళ్లే ఉద్యోగుల జీతంలో ఎటువంటి కోత విధించకూడదని యాజమాన్యాలకు సూచనలు జారీ అయ్యాయి. అసోం, కేరళ, పుదుచ్చేరి రాష్టాల్రకు చెందిన ఓటర్ల కోసం ఈనెల 9న సెలవు ప్రకటించారు. తమిళనాడు ఓటర్ల కోసం 23న ప్రత్యేక సెలవు వర్తించనుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వివిధ దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున అక్కడి ఓటర్ల కోసం 23, 29 తేదీల్లో సెలవులను కేటాయించారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక హక్కు అయిన ఓటును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు సుదూర ప్రాంతాలకు ప్రయాణించి ఓటు వేయడానికి తగిన సమయం కల్పించడమే ఈ ఉత్తర్వుల ప్రధాన ఉద్దేశం. ఈ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను గుర్తించి, ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.