– ఏ మేరకు అమలు జరిగిందో ప్రజలను అడగండి
– కేరళకు వెళ్లి అబద్దాలు ప్రచారం చేయడం కాదు
– మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శలు
నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: కేరళంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి గొప్పలు చెబితే అక్కడ రేవంత్ను చూసి వోటేసేదెవరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలయ్యాయని నిరూపించగలరా అని సవాల్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై సర్కారును శాసనసభలో బీఆర్ఎస్ సభ్యులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. సీఎం స్థాయిని రేవంత్రెడ్డి దిగదార్చేలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును అభాసుపాలు చేస్తున్న రేవంత్రెడ్డి ఎక్కవ కాలం ప్రజల్లో నిలవలేరన్నారు. గ్రామాల్లో తిరిగి తాము ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎలా అమలు చేస్తున్నామో ప్రజలను అడిగితే చెబుతారని అన్నారు. ప్రధాన అంశాలైన గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ పద్దులపై చర్చలు నడుస్తున్న సమయంలో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని విమర్శించారు. గజ్వేల్లో మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసుపై చేసిన దాడి ప్రభుత్వ కార్యాలయంపై దాడేనన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్పై బురజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ మంత్రి పార్లమెంట్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై నెగెటివ్గా మాట్లాడారని, ఆయనకు తన శాఖపై పూర్తి అవగాహన లేదని అన్నారు. స్టేషన్ ఘన్పుర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో ఆ నియోజకవర్గ ప్రజలతో రెఫరెండం పెట్టిస్తే తెలుస్తుందన్నారు. బయటకు వస్తే కాంగ్రెస్ అంటూ, విచారణ జరిపితే ఎమ్మెల్యే పదవి పోతుందని బీఆర్ఎస్లో ఉన్నానని కడియం శ్రీహరి చెప్పడం ఊసరవెల్లి రాజకీయాన్ని తలపిస్తున్నదన్నారు. మేడారం జాతరలో నాసిరకం పనులు చేయడంతోనే రెండు టన్నుల బండరాయి బాలుడి కాలుపై పడి తీవ్ర గాయాలవడంతో వైద్యులు ఆపరేషన్ చేసి కాలు తొలగించారన్నారు. ప్రమాదాలపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటే కాంగ్రెస్ పాలనలో అడుగంటుతున్నాయని, దీంతో వ్యవసాయ బావుల్లో రైతులు పూడిక తీస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన కాదని ప్రజాపీడిత పాలన అని ఆయన ఆరోపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలు, దాడులకు సీఎం రేవంత్రెడ్డి పాల్పడుతున్నాడని, హామీలు మరిచి దాడులతో డైవర్షన్, కరప్షన్ పాలిటిక్స్ చేస్తున్నారనని ఆరోపించారు. ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వారికి ఎలా బుద్ది చెప్పాలో ప్రజానీకానికి తెలుసని ఆయన పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





