– సీఎఫ్ ఓలు గోల్ కీపర్స్ వంటివారు
– పరిశ్రమల స్థాపనకు హైదరాబాద్ అనుకూలం
– డిప్యూటీ సి.ఎం మల్లు భట్టి విక్రమార్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: హైదరాబాద్ మహానగరం ఐటీ నుంచి లైఫ్ సైన్సెస్ వరకు అధునాతన తయారీ పరిశ్రమలతో ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాదు సోమాజిగూడ ప్రైవేట్ హోటల్లో కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సౌత్ రీజియన్ నిర్వహించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్స్ (సీఎఫ్ ఓ) లీడర్షిప్ అవార్డ్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక యువ రాష్ట్రం అన్నారు. పరిశ్రమలు నెలకొల్పేందుకు అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, మంచి వాతావరణం, ఔటర్ రింగ్ రోడ్డు, గొప్ప ఎయిర్ పోర్ట్ వు న్నాయన్నారు. భాష సమస్య లేదు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, త్రిబుల్ ఐటీ, పెద్ద సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయని వివరించారు. దేశం నలుమూలల నుంచి తెలంగాణలో కంపెనీలు పెట్టేందుకు సీఎఫ్ ఓలు కీలక భూమిక పోషించాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేద్దామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. కోవిడ్ తర్వాత, జీఎస్టీ రేషనలైజేషన్ సందర్భాల్లో సిఎఫ్ఓల పాత్ర కీలకమైందన్నారు. సీఐఐ సీఎఫ్ఓ ఎక్సలెన్స్ అవార్డ్స్ 4వ ఎడిషన్లో మీతో కలవడం నాకు గౌరవంగా, ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే, ఒకేసారి ఇంతమంది సీఎఫ్ఓలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం చాలా అరుదుగా వస్తుందన్నారు. సాధారణంగా ఈ స్థాయిలో ఫైనాన్స్ నిపుణులు ఒకచోట చేరడం అంటే – రాష్ట్ర బడ్జెట్ ఆడిట్ సమయం వచ్చిందనేది అర్థం అని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక వేదికను సృష్టించిన సీఐఐ సదరన్ రీజన్ను అభినందిస్తున్నాను. ఈ అవార్డులు నాయకత్వం, నైతికత, సహనశీలతను ప్రతిబింబిస్తాయి అన్నారు. సీఎఫ్ఓ పాత్ర ఈ రోజుల్లో కేవలం లెక్కలు చూసుకోవడం, కంప్లయెన్స్ నిర్వహించడమే కాకుండా వ్యూహకర్త, భాగస్వామి, సృజనకర్తగానూ మారింది అన్నారు. ప్రపంచ అనిశ్చితి, డిజిటల్ మార్పు, పర్యావరణ సవాళ్ల మధ్య సంస్థలను నడిపే ప్రధాన భాగస్వాములుగా సీఎఫ్ఓలు మారుతున్నారు. కొంతమేరకు సీఎఫ్ఓలు ఫుట్బాల్లో గోల్కీపర్ల్లా ఉంటారు, అన్నీ సజావుగా జరిగితే ఎవరూ గుర్తించరు, కానీ ఒక సంక్షోభం వస్తే అందరి చూపు సీఎఫ్ ఓల పైనే ఉంటుంది అన్నారు.
హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడులకు కేంద్రంగా మారింది. అదే సమయంలో పారదర్శకత, డిజిటల్ మార్పు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సంస్కృతిని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చిత్తశుద్ధితో కృషి చేస్తుంది అన్నారు. ఈ రోజుల్లో పెట్టుబడిదారులు, నియంత్రణ సంస్థలు, తమ వ్యూహాల తో స్థిరత్వాన్ని (సస్టెయినబిలిటీ) కలిపేలా ఆర్థిక నాయకులపై ఆశలు పెంచుతున్నారన్నారు.పారదర్శకత, సమర్థత, సృజనాత్మకత ఇవే మా ప్రభుత్వానికి ప్రాధాన్యమైన విలువలు. ఇవే గొప్ప సీఎఫ్ఓ నాయకత్వానికి కూడా గుర్తింపు అని డిప్యూటీ సీఎం వివరించారు. ఈ రోజు సీఐఐ ఇక్కడ ప్రతిభను గుర్తించడం ద్వారా తెలంగాణ, భారత ఆర్థిక వృద్ధి తదుపరి దశను తీర్చిదిద్దే లక్షణాలపై వెలుగులు ప్రసరిస్తుంది అన్నారు. విజేతలు, నామినీలు అందరికీ హృదయపూర్వక అభినందనలు. మీ విజయాలు మీకే కాకుండా ఆర్థిక సమాజానికి, దేశానికీ గర్వకారణం అన్నారు. ఈ రోజు విజేతలు ట్రోఫీలతో ఇంటికి వెళ్తారు, కానీ ఒక సీఎఫ్ఓకి లభించే అసలైన బహుమతి చాలా అరుదైనది ఆడిటర్ల ఎలాంటి ఫుట్నోట్లు లేని వార్షిక నివేదిక అని సభికులను నవ్వించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





